
న్యూఢిల్లీ: భారత ఫస్ట్ క్లాస్ వెటరన్ క్రికెటర్, ఐపీఎల్ ట్రోఫీ విన్నర్ రజత్ భాటియా తన 20 ఏళ్ల సుదీర్ఘ కెరీర్కు గుడ్బై చెప్పాడు. అన్ని రకాల క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నట్లు ఢిల్లీకి చెందిన రజత్ భాటియా బుధవారం ప్రకటించాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఉత్తరాఖండ్, ఢిల్లీ, తమిళనాడు, రాజస్థాన్ జట్ల తరఫున 112 ఫస్ట్ క్లాస్, 119 లిస్ట్-ఏ, 146 టీ20 మ్యాచ్లు ఆడాడు.
తమిళనాడు తరఫున 1999-2000 సీజన్లో ఫస్ట్క్లాస్ క్రికెట్లోకి అడుగుపెట్టిన భాటియా.. మొత్తం 112 మ్యాచ్ల్లో 6,482 పరుగులు చేయడంతో పాటు 137 వికెట్లు పడగొట్టి మంచి ఆల్రౌండర్గా గుర్తింపు పొందాడు. ఇందులో 3 సెంచరీలతో పాటు 19 హాఫ్ సెంచరీలున్నాయి.
2007-08 రంజీ సీజన్లో ఢిల్లీ విజేతగా నిలవడంలో భాటియా కీలక పాత్ర పోషించాడు. ఉత్తర్ ప్రదేశ్తో జరిగిన ఫైనల్లో 139 పరుగులతో అజేయంగా నిలిచిన భాటియా.. ఆ సీజన్లో మొత్తం ఏడు ఇన్నింగ్స్ల్లో 512 రన్స్ చేశాడు.
ఐపీఎల్ ఆరంభ సీజన్ ఢిల్లీ డేర్డేవిల్స్కు ప్రాతినిధ్యం వహించిన భాటియా.. 2012లో ఐపీఎల్ టైటిల్ నెగ్గిన కోల్కతా నైట్ రైడర్స్ టీమ్లోనూ ఉన్నాడు. తన కెరీర్లో ఇప్పటి వరకు 95 ఐపీఎల్ మ్యాచ్లు ఆడాడు. ఢిల్లీ డేర్డేవిల్స్కు మూడేళ్లు ఆడిన భాటియా.. ఆ తర్వాత రాజస్థాన్ రాయల్స్, రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్కు ఆడాడు. 2017 సీజన్ వరకు ప్రతీ సీజన్ ఆడాడు. తన పదేళ్ల ఐపీఎల్ కెరీర్లో భాటియా నెమ్మదైన బౌలింగ్ వైవిధ్యాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు.
అయితే ఫస్ట్ క్లాస్లో ఇంత రాణించినా భాటియా ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడలేకపోయాడు. ఇక విచిత్రం ఏంటంటే అంతర్జాతీయంగా 100 ప్లస్ ఫస్ట్ క్లాస్, లిస్ట్-ఏ, టీ20 మ్యాచ్లు ఆడి.. ఒక్క ఇంటర్నేషనల్ మ్యాచ్ కూడా ఆడిని ఆటగాళ్లు28 మంది కాగా.. ఇందులో అత్యధికంగా ఇంగ్లండ్ నుంచి 24 మంది ఉన్నారు. ఇద్దరు సౌతాఫ్రికా వాళ్లు కాగా.. న్యూజిలాండ్, భారత్ నుంచి ఒక్కొక్కరు ఉన్నారు. అయితే ఆ భారత్ నుంచి ఉన్న ఆ ఒక్క దురదృష్టవంతుడు రజత్ భాటియానే. 2014 టీ20 ప్రపంచకప్ 30 మంది ప్రాబబుల్స్లో కూడా ఉన్న భాటియా అవకాశాన్ని మాత్రం అందుకోలేకపోయాడు.