
హైదరాబాద్: ఐపీఎల్ టోర్నీలో భాగంగా శుక్రవారం చెన్నై సూపర్ కింగ్స్తో జరిగే మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు కొత్త జెర్సీలో బరిలోకి దిగనుంది. జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియం ఆతిథ్యమిస్తోన్న ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు పింక్ జెర్సీలో ఈ మ్యాచ్ ఆడనుంది.
ప్రజల్లో క్యాన్సర్పై అవగాహన కల్పించేందుకు రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కొత్త జెర్సీని బుధవారం రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ అజ్యింకె రహానే ఆవిష్కరించాడు. ఈ కార్యక్రమంలో రహానేతో పాటు జట్టు సభ్యులు హెన్రిచ్ క్లాసెన్, గౌతమ్ కృష్ణప్ప, మహిపాల్ లొమ్రోర్ పాల్గొన్నారు.
ఐపీఎల్ 2018 స్పెషల్ వెబ్ సైట్ | ఐపీఎల్ 2018 పూర్తి షెడ్యూల్
ఈ సందర్భంగా రహానే మాట్లాడుతూ 'ఒక ఆటగాడిని ఈ పని చాలా చిన్నదిగా నాకు అనిపిస్తుంది. కానీ క్యాన్సర్ రహిత సమాజం కోసం మేం చేసే ఈ పని చాలా కీలకమైనది. రాబోయే మ్యాచ్లో అద్భుతమైన ప్రదర్శన చేసి ప్రజల్లో క్యాన్సర్పై పెద్ద ఎత్తున అవగాహన తీసుకురావాలి అని భావిస్తున్నా' అని అన్నాడు.
ఇదిలా ఉంటే ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలను రాజస్థాన్ రాయల్స్ జట్టు తమ ట్విట్టర్ ఖాతాలో అభిమానులతో పంచుకుంది. ప్రజల్లో అవగాహన పెంచేందుకు రాయల్స్ జట్టు మూడు రంగులతో కూడిన ఈ ప్రత్యేకమైన జెర్సీని రూపొందించింది. ఇందులో పింక్ రంగు బ్రెస్ట్ క్యాన్సర్ని, బర్గండి రంగు ఓరల్ క్యాన్సర్ని, టీల్ రంగు సెర్వికల్ క్యాన్సర్ని ప్రతిబింబిస్తున్నాయి.
రాజస్థాన్ రాయల్స్ మొదలుపెట్టిన ఈ ప్రచారానికి రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు, జాతీయ క్యాన్సర్ గ్రిడ్, ఇండియన్ క్యాన్సర్ సొసైటీ, ఇండియన్ డెంటల్ అసోసియేషన్ ఆఫ్ ది స్టేట్ మద్దుతు పలికాయి. ఈ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ పేలవ ప్రదర్శన చేస్తోంది. టోర్నీలో భాగంగా ఇప్పటివరకు 10 మ్యాచ్లాడిన రాజస్థాన్ 4 మ్యాచ్ల్లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో ఆఖరి నుంచి మూడో స్థానంలో కొనసాగుతోంది.