
దుబాయ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు ఆఖరి స్థానంలో నిలుస్తుందని అంచనా వేసిన న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ స్కాట్ స్టైరిస్పై ఆ ఫ్రాంచైజీ వ్యంగ్యాస్త్రాలు సంధించింది. సోమవారం స్కాట్ స్టైరిస్ ఈ సీజన్ పాయింట్స్ టేబుల్స్లో ఆయా జట్ల స్థానాలను అంచనా వేస్తూ.. ప్లే ఆఫ్కు వెళ్లే టీమ్స్ వివరాలు వెల్లడించాడు. ఐపీఎల్ చరిత్రలోనే ఇంత వరకు ఫైనల్కు వెళ్లని ఢిల్లీ క్యాపిటల్స్ టేబుల్ టాపర్గా నిలుస్తుందని, డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ రెండో స్థానం కైవసం చేసుకుంటుందన్నాడు.
ఇక దినేశ్ కార్తీక్ సారథ్యంలో కోల్కతా నైట్ రైడర్స్, మహేంద్ర సింగ్ ధోనీ నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ 3,4 స్థానాల్లో నిలిచి ప్లే ఆఫ్కు అర్హత సాధిస్తాయన్నాడు. ఐదో స్థానంలో సన్ రైజర్స్ హైదరాబాద్, ఆరోస్థానంలో విరాట్ కోహ్లీ నేతృత్వంలోని ఆర్సీబీ నిలుస్తుందన్నాడు. ఇక స్టీవ్ స్మిత్ సారథ్యంలో బరిలోకి దిగుతున్న రాజస్థాన్ రాయల్స్ ఈ సీజన్లో ఆఖరి స్థానాన్ని కైవసం చేసుకుంటుందని, కేఎల్ రాహుల్ నేతృత్వంలోని కింగ్స్ పంజాబ్ ఏడో స్థానంలో సరిపెట్టుకుంటుందని అంచనా వేసాడు.
ఈ ట్వీట్పై రాజస్థాన్ రాయల్స్ తనదైన శైలిలో స్పందించింది. స్కాట్ స్టైరిస్ ట్వీట్ను రీట్వీట్ చేస్తూ.. 'ప్రస్తుతమైతే ఈయన ట్వీట్ సేవ్ చేసుకోండి'అని క్యాప్షన్గా పేర్కొంది. పైకి మాములుగానే ఉన్నా.. ఈ ట్వీట్ అయితే సేవ్ చేయండి ఈయన సంగతి తర్వాత చెబుదామని పరోక్షంగా చెప్పకనే చెప్పింది. ఇక రాజస్థాన్ ట్వీట్పై స్కాట్ స్టైరిస్ కూడా స్పందించాడు. తన అంచనా తప్పని నిరూపించండని సవాల్ విసిరాడు.
'వావ్ బాగుంది.. నా అంచనా తప్పని నిరూపించండి. అప్పుడు నా కన్నా సంతోషించేవారు ఎవరూ ఉండరు. మీ జట్టులో నా ఫ్రెండ్ ఇష్ సోధీ ఉన్నాడు. ఈ విషయంలో అతను మీకు సహాయం చేస్తాడు. అతని కారణంగానే మీకు మద్దతు తెలుపుతున్నా'అని ట్వీట్ చేశాడు. ఇక ఇష్ సోదీ ఈ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ స్పిన్ కన్సల్టెంట్గా నియమితుడయ్యాడు. ఈ సరదా సంభాషణ ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తోంది. సెప్టెంబర్ 22న చెన్నై సూపర్ కింగ్స్తో జరిగే మ్యాచ్తో రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్ 2020 జర్నీ ప్రారంభించనుంది. అరంగేట్ర సీజన్ మినహా మళ్లీ ఆ జట్టు టైటిల్ అందుకోలేదు. ఈ సారి ఎలాగైనా ఆ కోరికను నెరవేర్చుకోవాలని భావిస్తోంది.