
హైదరాబాద్: ఐపీఎల్ టోర్నీలో భాగంగా మంగళవారం రాత్రి రాజస్థాన్ రాయల్స్-కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్లు తలపడ్డాయి. జైపూర్ సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ పవర్ ప్లేలో తొలిసారి అరవై పరుగుల మార్కుని దాటింది.
ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ మొదటి ఆరు ఓవర్లలో 63 పరుగులు సాధించింది. ఫలితంగా ఈ సీజన్లో అత్యుత్తమ పవర్ ప్లే స్కోరును రాజస్థాన్ నమోదు చేసింది. అంతకుముందు రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ పవర్ ప్లేలో సాధించిన 52 పరుగులే ఇప్పటివరకూ ఆ జట్టుకు అత్యుత్తమం.
ఐపీఎల్ 2018 స్పెషల్ వెబ్ సైట్ | ఐపీఎల్ 2018 పూర్తి షెడ్యూల్
మంగళవారం పంజాబ్తో జరిగిన మ్యాచ్లో ఈ పరుగులను రాజస్థాన్ అధిగమించింది. కాగా, ఈ సీజన్లో ఇప్పటి వరకు రాజస్థాన్ రాయల్స్ పవర్ ప్లేలో కింగ్స్ పంజాబ్పై 63 పరుగులతో పాటు ఆర్సీబీపై 52 పరుగులు, ఢిల్లీ డేర్డెవిల్స్పై 51 పరుగులు, కేకేఆర్పై 48 పరుగులు, సన్రైజర్స్పై 48 పరుగులు చేసింది.
ఇదిలా ఉంటే ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ జోస్ బట్లర్ (82: 58 బంతుల్లో 9 ఫోర్లు, ఒక సిక్సు) దూకుడుగా ఆడినా.. మిడిలార్డర్ విఫలమవడంతో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది. దీంతో పంజాబ్కు 159 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది.
రాజస్థాన్ కెప్టెన్ రహానే(9) మరోసారి విఫలమయ్యాడు. ప్రయోగాత్మకంగా బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకు వచ్చిన గౌతమ్ కృష్ణప్ప(8) సైతం నిరాశపరిచాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన సంజు శాంసన్ (22) కీలక సమయంలో ఔటవడంతో రాజస్థాన్ తడబడింది. ఒక ఎండ్లో వరుసగా వికెట్లు పడుతున్నా.. జోస్ బట్లర్ మాత్రం వరుసగా మూడో మ్యాచ్లోనూ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు.
పవర్ ప్లేలో దూకుడుగా ఆడిన జోస్ బట్లర్... మిడిల్ ఓవర్లలో ఎక్కువగా సింగిల్స్, డబుల్స్కే ప్రాధాన్యమివ్వడంతో స్కోరు బోర్డు ఆఖర్లో నెమ్మదించింది. జట్టు స్కోరు 132 వద్ద బట్లర్ స్టంపౌట్ కాగా అనంతరం వచ్చిన స్టువర్ట్ బిన్నీ (11) లేని పరుగు కోసం ప్రయత్నించి రనౌటయ్యాడు. చివర్లో బెన్స్టోక్స్ (14) దూకుడుగా ఆడకపోవడంతో రాజస్థాన్ తక్కువ స్కోరుతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
పంజాబ్ బౌలర్లలో ఆండ్రూ టై నాలుగు వికెట్లు తీయగా, ముజీబ్ రెండు, స్టాయినిస్ చెరో వికెట్ తీసుకున్నారు.