ముంబై: కరోనా వైరస్ కారణంగా ఐపీఎల్ నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్న విషయం తెలిసిందే. వాస్తవానికి మార్చి 29న ప్రారంభంకావాల్సిన ఈ క్యాష్ రిచ్ లీగ్.. ఈ ప్రాణాంతక వైరస్ కారణంగా ఏప్రిల్ 15కు వాయిదా పడింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితుల్లో ఈ మెగాటోర్నీ జరుగుతుందో లేదో? అనే అనుమానాలు నెలకొన్నాయి. ఓవైపు పూర్తిగా రద్దయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. అయితే మరోవైపు ఈ ఏడాది ఐపీఎల్ నిర్వహణ సాధ్యమవుతుందని, కానీ పూర్తి స్థాయిలో కాకుండా 'మినీ ఐపీఎల్' లాగా నిర్వహించవచ్చని రాజస్థాన్ రాయల్స్ సహ యజమాని మనోజ్ బదలే తెలిపారు.
ఓ జాతీయ చానెల్తో మాట్లాడుతూ..'ఈ ఏడాది వినూత్నంగానైనా ఐపీఎల్ జరుగుతుందని ఆశిస్తున్నా. మినీ ఐపీఎల్ కూడా నిర్వహించవచ్చు. ప్రజలంతా సృజనాత్మకంగా ఉండటానికి సిద్ధంగా ఉండండి. బోర్డు సభ్యులంతా కలిసి టోర్నీని నిర్వహించడానికి ప్రయత్నించాలి. క్రికెట్కు ఈ టోర్నీ ఎంతో ముఖ్యం. ఐపీఎల్ వల్ల ఎంతో మంది దేశీయ ఆటగాళ్లకు మంచి చేకూరుతుంది.
అంతేగాకుండా స్టార్ ఆటగాళ్లు, నిర్వహకులు, బ్రాడ్కాస్టర్స్కు ఆర్థికంగా దోహదపడుతుంది. ఇది ఎంతో మందికి జీవనోపాధినిస్తుంది. ఈ టోర్నీని నిర్వహించడం మా బాధ్యత. నిర్వహణ కోసం సాధ్యమైనంత వరకు ప్రయత్నిస్తాం' అని మనోజ్ అన్నారు.
ఇక దేశంలో కరోనా వేగంగా విస్తరిస్తుండటంతో ఐపీఎల్ నిర్వహణపై సందేహాలు తలెత్తుతున్నాయి. దీంతో ఏప్రిల్ 15న ప్రారంభంకావాల్సిన ఐపీఎల్ను మరోసారి వాయిదా వేసే అవకాశం కనిపిస్తోంది. అయితే అన్ని కుదిరితే ఐపీఎల్ను ఆగస్టు-సెప్టెంబర్లో నిర్వహించాలని యోచిస్తున్నట్లు బీసీసీఐకి చెందిన ఓ అధికారి తెలిపారు.
'ప్రస్తుత పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం. కరోనా పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తున్నాం. ఫ్రాంచైజీలతో మాట్లాడుతున్నాం. అందరి ఆరోగ్యమే ముఖ్యం. కరోనా పరిస్థితులపై అంచనా వేసి నిర్ణయం తీసుకుంటాం. ఆగస్టు-సెప్టెంబర్లో నిర్వహించాలని భావిస్తున్నాం. అయితే ఆ సమయంలో కొన్ని టోర్నీలు ఉన్నాయి' అని సదరు అధికారి పేర్కొన్నారు.