
ముంబై: దేశంలో ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ ఉగ్రరూపం దాల్చడంతో ఎంతోమంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విపత్కర సమయంలో ప్రజల జీవితాల్లో ఐపీఎల్ కాస్తయిన ఆనందాన్ని నింపగలదని రాజస్థాన్ రాయల్స్ ఆల్రౌండర్ క్రిస్ మోరిస్ అభిప్రాయపడ్డాడు. కోల్కతా నైట్రైడర్స్ (కేకేఆర్)తో శనివారం జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ మోరీస్(4/23) బంతితో మెరిసాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. దేశంలో నెలకొన్న విపత్క పరిస్థితులపై స్పందించాడు.
'భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లోనే కొవిడ్ వ్యాప్తి ఎందుకు ఎక్కువగా ఉంటుందో అనే అంశంపై జట్టు సభ్యులందరం చర్చించుకొన్నాం. కరోనా నియంత్రణకు ఫ్రంట్లైన్ వారియర్స్ చేస్తున్న సేవల గురించి ఎంత చెప్పినా తక్కువే. వారు 24 గంటలు కృషి చేస్తున్నారు. ఇది గొప్ప విషయం. ఒక జట్టుగా ప్రపంచంలోని ప్రతి ఒక్కరి బాధ మాకు తెలుసు. బయట ఏం జరగుతుందో అర్థం చేసుకోవడం కష్టంగా ఉంది.
మా ముఖాల్లో చిరునవ్వుకు కారణమైన వారి కోసం ఆడి.. వాళ్ల ముఖాల్లో కూడా చిరునవ్వు ఉండేలా చూడటం మా బాధ్యత. 'మేం గెలిచినా, ఓడినా మా ఆటను చూసిన ప్రజలకు అది కాస్తయిన ఉపశమని ఇస్తే చాలు. కరోనా వారియర్స్కి, కొవిడ్ బాధితులకు రాజస్థాన్ రాయల్స్ అండగా ఉంటుంది'' అని క్రిస్ మోరిస్ పేర్కొన్నాడు.
ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన కోల్కతా 20 ఓవర్లలో 9 వికెట్లకు 133 పరుగులు చేసింది. రాహుల్ త్రిపాఠి (26 బంతుల్లో 36; 1 ఫోర్, 2 సిక్స్లు), దినేశ్ కార్తీక్ (24 బంతుల్లో 25; 4 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. క్రిస్ మోరిస్ (4/23) బంతితో విజృంభించాడు. అనంతరం బ్యాటింగ్కు దిగిన రాజస్తాన్ రాయల్స్ 18.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 134 పరుగులు చేసి గెలిచింది. కెప్టెన్ సంజూ సామ్సన్ (41 బంతుల్లో 42 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) చివరి వరకు క్రీజులో నిలిచి జట్టుకు గెలుపును కట్టబెట్టాడు. మిల్లర్ (23 బంతుల్లో 24 నాటౌట్; 3 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు.