అండర్ 19 ప్రపంచకప్ 2026లో భాగంగా భారత్, బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న మ్యాచ్ అర్థాంతరంగా ఆగిపోయింది. వర్షం అంతరాయం కలిగించడంతో అంపైర్లు ఆటను నిలిపేసారు. మ్యాచ్ ఆగిపోయే సమయానికి భారత్ అండర్ 19 జట్టు 39 ఓవర్లలో 6 వికెట్లకు 192 పరుగులు చేసింది. వైభవ్ సూర్యవంశీ(67 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్లతో 72) శతకం చేసే అవకాశాన్ని చేజార్చుకోగా.. అభిజ్ఞాన్ కుండు(63 బ్యాటింగ్), అంబ్రిష్(4 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు.
ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత అండర్ 19 జట్టుకు శుభారంభం దక్కలేదు. కెప్టెన్ ఆయుష్ మాత్రే(6) తన పేలవ ఫామ్ను కొనసాగించగా.. వేదాంత్ త్రివేది గోల్డెన్ డక్గా వెనుదిరిగాడు. బంగ్లా పేసర్ ఫర్హాద్ భారత్ను దెబ్బతీసాడు. విహాన్ మల్హోత్ర సాయంతో వైభవ్ సూర్యవంశీ జట్టు స్కోర్ను 50 పరుగులు ధాటించాడు. అయితే మల్హోత్ర(7)ను హకీమ్ తమీమ్ ఔట్ చేయగా.. అభిజ్ఞాన్ కుండు సాయంతో వైభవ్ సూర్యవంశీ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

భారీ షాట్లతో సెంచరీ దిశగా సాగిన అతన్ని హోస్సేన్ క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు. కాన్షిక్ చౌహన్తో అభిజ్ఞాన్ కుండు జట్టు ఇన్నింగ్స్ను నిలబెట్టాడు. ఈ క్రమంలో అతను హాఫ్ సెంచరీ కూడా సాధించాడు. మరోవైపు నిలకడగా ఆడిన కాన్షిక్ చౌహన్ను హకీమ్ పెవిలియన్ చేరడంతో భారత్ 173 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. క్రీజులోకి అంబ్రిష్ రాగా.. వర్షం ఆటకు అంతరాయం కలిగించింది. వర్షం ఆగిన తర్వాత మైదానాన్ని పరిశీలించి ఆటను కొనసాగించే విషయంపై అంపైర్లు నిర్ణయం తీసుకోనున్నారు.