ఆ క్యాచ్ పట్టి ఉంటే..
రాహుల్ త్రిపాఠి గనుక ఆ క్యాచ్ పట్టి ఉంటే దినేశ్ కార్తీక్ 8 పరుగుల వ్యక్తిగత స్కోర్కే వెనుదిరిగేవాడు. అప్పుడు ఆర్సీబీ 175 పరుగులకే పరిమితమయ్యేది. ఆర్సీబీ ఇన్నింగ్స్ సందర్భంగా ఫరూఖ్ చివరి ఓవర్ వేయగా... మూడో బంతిని కార్తీక్ డీప్ స్క్వేర్ దిశగా భారీ షాట్ ఆడాడు. బంతి నేరుగా బౌండరీ లైన్ మీదున్న రాహుల్ త్రిపాఠి చేతిలోకి దూసుకెళ్లింది. అయితే అప్రమత్తంగా లేని త్రిపాఠి ఆ బంతిని అందుకోవడంలో విఫలమయ్యాడు. దాంతో అతని చేతులో నుంచి జారిన బంతి బౌండరీ బయట పడి సిక్సర్గా మారింది.
ఆగం చేసినవ్రా త్రిపాఠి..
ఈ మిస్ ఫీల్డింగ్పై సన్రైజర్స్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కీలక సమయంలో కీలక బ్యాటర్ ఇచ్చిన బంగారం లాంటి క్యాచ్ను వదిలేసి జట్టు పతనానికి త్రిపాఠి కారణమయ్యాడని కామెంట్ చేస్తున్నారు. రాహుల్ త్రిపాఠికి ఆర్సీబీ అభిమానులు, దినేశ్ కార్తీక్ కృతజ్ఞతలు చెబుతారని సెటైర్లు పేల్చుతున్నారు. రాహుల్ త్రిపాఠి క్యాచ్ వదిలేసిన తర్వాత కేన్ మామ అతన్ని చెప్పుతో కొడతాడనే ఫన్నీ మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు. చెత్త ఫీల్డింగ్తో రాహుల్ త్రిపాఠి అనవసరంగా 16 పరుగులిచ్చాడని కామెంట్ చేస్తున్నారు.
చెలరేగిన ఫాఫ్, కార్తీక్..
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 3 వికెట్లకు 192 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ(0) గోల్డెన్ డకౌటైనా.. కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్(50 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్లతో 73 నాటౌట్), రజత్ పటిదార్(38 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 48) రాణించారు. చివర్లో గ్లేన్ మ్యాక్స్వెల్(24 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 33), దినేశ్ కార్తీక్(8 బంతుల్లో ఫోర్, 4 సిక్స్లతో 30 నాటౌట్) మెరుపులు మెరిపించారు. సన్రైజర్స్ బౌలర్లలో జగదీష సుచిత్ రెండు వికెట్లు తీయగా.. కార్తీక్ త్యాగీ ఓ వికెట్ పడగొట్టాడు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన సన్రైజర్స్ 51 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది.


Click it and Unblock the Notifications












