హైదరాబాద్: 'రాహుల్ తెవాటియా' ఈ పేరు తెలియని క్రికెట్ అభిమాని ఉండరంటే అతిశయోక్తి కాదు. తెవాటియా క్రీజులో ఉన్నాడంటే.. గెలుపోటములు తారుమారవుతాయి. బౌలర్ల కెరీర్లు ముగిసిపోతాయి. చిచ్చర పిడుగులా బౌలర్లపై విరుచుకుపడే తెవాటియా ఇప్పటికే ఎన్నో మరిచిపోలేని విజయాలు అందించాడు.
ఐపీఎల్ 2020 సీజన్తో తొలిసారి రాహుల్ తెవాటియా అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ సీజన్లో రాజస్థాన్ రాయల్స్కు ప్రాతినిథ్యం వహించిన తెవాటియా.. పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో వెస్టిండీస్ పేసర్ షెల్డన్ కాట్రెల్ వేసిన ఆఖరి ఓవర్లో వరుసగా 5 సిక్స్లు బాది అసాధారణ విజయాన్నందించాడు.
తొలి 26 బంతుల్లో 23 పరుగులే చేసిన తెవాటియా.. చివరి 5 బంతుల్లో 30 పరుగులు చేశాడు. ఈ అసాధారణ ఇన్నింగ్స్తో షెల్టన్ కాట్రెల్ కెరీర్కు ఎండ్ కార్డ్ వేసాడు. గతేడాది గుజరాత్ టైటాన్స్కు మారిన అతను అదే జోరును కొనసాగించాడు. ఆఖరి రెండు బంతులకు సిక్స్లు బాది గెలిపించాడు. ఈ సీజన్లోనూ అదే తరహా బ్యాటింగ్ కొనసాగిస్తున్నాడు.

ఐపీఎల్లో గొప్ప ఫినిషర్గా గుర్తింపు తెచ్చుకున్న రాహుల్ తెవాటియా.. అతి త్వరలోనే టీమిండియా తరఫున బరిలోకి దిగుతానని ధీమా వ్యక్తం చేశాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన క్రికెట్ ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నాడు. నిక్కర్, బనియన్తో గల్లీల్లో ఆడే పల్లెటూరు పిల్లగాడు.. ఇప్పుడు ఐపీఎల్లో ఫినిషర్గా సత్తా చాటుతున్నాడని, త్వరలోనే టీమిండియాకు కూడా ఆడుతాడని తన గురించి చెప్పుకున్నాడు.
'టీమిండియాకు ఎంపిక చేయడం అనేది సెలెక్టర్ల చేతిలో ఉంది. నిక్కర్ బనియన్తో గల్లీల్లో ఆడుకునే ఓ పల్లెటూరు పిల్లగాడు.. ఇప్పుడు ఐపీఎల్లో ఫినిషర్గా సత్తా చాటుతున్నాడు. కాబట్టి టీమిండియాకు ఆడాలనే కలకు కూడా నేను దగ్గరగా ఉన్నానని అనుకుంటున్నా. అతి త్వరలోనే ఈ కల నెరవేరుతుందనే నమ్మకంతో ఉన్నా.
చిన్నప్పుడు టీవీలో క్రికెట్ చూసినప్పుడే టీమిండియాకు ఆడాలనుకున్నా. 'ఈ పెద్ద మైదానాల్లో టీమిండియా జెర్సీతో ఆడాలనుకుంటున్నా'అనే అప్పుడే అందరితో అనేవాడిని. ఇప్పుడు ఆ కలకు దగ్గరగా వచ్చాను. ఇప్పుడు ఎందుకు వెనకడుగు వేస్తాను. ఓ ఆటగాడిగా రోజు రోజుకి మెరుగవ్వాలి. లేకుంటే ఆడటం వల్ల ఉండే ప్రయోజనం ఏం ఉంటుంది. ముందడుగు వేయాలనే ప్రేరణ ఉండాలి. ప్రస్తుతం నేను మెరుగైన స్థానంలోనే ఉన్నాను'అని తెవాటియా చెప్పుకొచ్చాడు.
రెండేళ్ల క్రితం ఇంగ్లండ్తో టీ20 సిరీస్కు రాహుల్ తెవాటియా టీమిండియా పిలుపు అందుకున్నాడు. కానీ యోయో టెస్ట్ విఫలమవడంతో జట్టులోకి రాలేకపోయాడు. ఆ సిరీస్తోనే ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేశారు.