టీమిండియా మాజీ హెడ్ కోచ్, బ్యాటింగ్ దిగ్గజం రాహుల్ ద్రవిడ్ చిన్న కొడుకు అన్వయ్ ద్రవిడ్ (100 నాటౌట్) అజేయ శతకంతో చెలరేగాడు. తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకున్న అన్వయ్ ద్రవిడ్ ఏజ్ క్రికెట్లో సెంచరీల మోత మోగిస్తున్నాడు. ప్రతిష్టాత్మక దేశవాళీ అండర్ 16 టోర్నీ విజయ్ మర్చంట్ ట్రోఫీలో అన్వయ్ ద్రవిడ్ అజేయ శతకంతో చెలరేగాడు.
జార్ఖండ్తో శుక్రవారం ముగిసిన మూడ్రోజుల మ్యాచ్లో కర్ణాటక తరఫున నాలుగో నెంబర్ ఆటగాడిగా బరిలోకి దిగిన అన్వయ్ ద్రవిడ్ 153 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్లతో సెంచరీ సాధించాడు.

మరో బ్యాటర్ అనిరుధ్(76)తో కలిసి మూడో వికెట్కు 167 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన అన్వయ్ ద్రవిడ్.. సుకృత్(33)తో నాలుగో వికెట్కు 43 పరుగులు జోడించాడు. ఫలితంగా కర్ణాటక 123.3 ఓవర్లలో 441/4 స్కోరుతో చివరిరోజును ముగించింది. దాంతో మ్యాచ్ ఫలితం తేలకుండా డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో జార్ఖండ్ 387 పరుగులకు ఆలౌటైంది.
ఇటీవలే జరిగిన కర్ణాటక క్రికెట్ అసోసియేషన్(కేఎస్సీఏ) అండర్-16 టోర్నీలో బెంగళూరు జోన్కు ఆడిన అన్వయ్ ద్రవిడ్ డబుల్ సెంచరీతో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇక అన్వయ అన్నయ్య సమిత్ ద్రవిడ్ కూడా అండర్ 19 క్రికెట్లో సత్తా చాటుతున్నాడు. నిలకడైన ప్రదర్శనతో భారత అండర్ 19 జట్టుకు ఎంపికయ్యాడు. ఇటీవలే ఆస్ట్రేలియా అండర్ 19 జట్టుతో తలపడిన భారత అండర్ 19 జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు.
ద్రవిడ్ ఇద్దరు కొడుకులు క్రికెట్లో దూసుకుపోతుండటంపై అతని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. టీ20 ప్రపంచకప్ 2024 విజయానంతరం టీమిండియా హెడ్ కోచ్ పదవి బాధ్యతల నుంచి తప్పుకున్న ద్రవిడ్.. రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్గా బాధ్యతలు చేపట్టాడు.