టీమిండియా హెడ్ కోచ్గా రాహుల్ ద్రవిడ్ నియమితులయ్యాడు. మరోసారి అవకాశం కల్పిస్తూ.. అతని కాంట్రాక్ట్ను భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) పొడిగించింది. రాహుల్ ద్రవిడ్తో పాటు సపోర్ట్ స్టాఫ్ కాంట్రాక్ట్లను కూడా పునరుద్దరించింది. దాంతో టీమిండియా బౌలింగ్ కోచ్గా పరాస్ మాంబ్రే, ఫీల్డింగ్ కోచ్గా టీ దిలీప్, బ్యాటింగ్ కోచ్గా విక్రమ్ రాథోడ్లు కొనసాగనున్నారు.
ఈ మేరకు బీసీసీఐ బుధవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. 'టీమిండియా సీనియర్ మెన్ టీమ్ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, సపోర్ట్ స్టాఫ్ కాంట్రాక్ట్లను బీసీసీఐ పొడిగించింది. వన్డే ప్రపంచకప్ 2023తో అతని కాంట్రాక్ట్ ముగియడంతో ద్రవిడ్తో బోర్డు చర్చలు జరిపింది. కోచ్గా కొనసాగేందుకు ఆసక్తి చూపించడంతో కాంట్రాక్ట్ను పునరుద్దరించింది.

భారత జట్టును తీర్చిదిద్దడంలో రాహుల్ ద్రవిడ్ పాత్రను బోర్డు గుర్తించింది. అతని అసాధారణమైన వృత్తి నైపుణ్యాన్ని ప్రశంసిస్తూ మరోసారి అతనికి హెడ్కోచ్గా అవకాశం కల్పిస్తోంది. ఎన్సీఏ డైరెక్టర్గా.. తాత్కలిక హెడ్ కోచ్గా వీవీఎస్ లక్ష్మణ్ అందిస్తున్న సేవలను కూడా బోర్డు అభినందిస్తోంది. మైదానంలో ఈ ఇద్దరి రికార్డ్ భాగస్వామ్యాల మాదిరిగానే.. ద్రవిడ్-లక్ష్మణ్ భారత క్రికెట్ను తీర్చిదిద్దుతున్నారని ప్రశంసించింది.' అని ఆ ప్రకటనలో బీసీసీఐ పేర్కొంది.
హెడ్ కోచ్గా నియమితులైన రాహుల్ ద్రవిడ్కు బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీతో పాటు సెక్రటరీ జై షా అభినందనలు తెలిపారు.
హెడ్ కోచ్గా మరోసారి తనకు అవకాశం ఇవ్వడంపై రాహుల్ ద్రవిడ్ సంతోషం వ్యక్తం చేశాడు. ఈ అవకాశం కల్పించిన బీసీసీఐ, అఫిస్ బేరర్స్లకు కృతజ్ఞతలు తెలియజేశాడు. ఇక టీమ్ డ్రెస్సింగ్ రూమ్లో నెలకొల్పిన మంచి వాతావరణం పట్ల తాను గర్వంగా ఫీలవుతున్నానని తెలిపాడు. అసాధారణ ప్రదర్శనతో టీమిండియా ప్రపంచకప్ ఫైనల్ చేరిందని, భవిష్యత్తులో అదే తరహా ప్రదర్శన కనబర్చేందుకు కృషి చేస్తానని తెలిపాడు.