
ముంబై: శ్రీలంక పర్యటనలో సిరీస్లు నెగ్గడమే తమ ప్రధాన లక్ష్యమని నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ) డైరెక్టర్, టీమిండియా బీ టీమ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ తెలిపాడు. భారత్-ఎ, అండర్-19 కోచ్గా ఎంతో సక్సెస్ సాధించి, ఎంతో మంది యువ ఆటగాళ్లను తీర్చిదిద్దిన రాహుల్ ద్రవిడ్ తొలిసారి నేషనల్ టీమ్కు కోచ్గా వ్యవహరిస్తున్నాడు. ఈ టూర్ విషయంలో తన ఆలోచన చాలా క్లియర్గా ఉందని ద్రవిడ్ స్పష్టం చేశాడు. ఈ పర్యటనకు బయల్దేరే ముందు ఆదివారం జరిగిన వర్చువల్ మీడియా కాన్ఫరెన్స్లో కెప్టెన్ శిఖర్ ధావన్తో కలిసి కోచ్ రాహుల్ ద్రవిడ్ మాట్లాడాడు. టూర్లో తమ ప్రధాన టార్గెట్ సిరీస్లు నెగ్గడమే అని చెప్పాడు. టీ20 వరల్డ్ కప్నకు ముందు భారత్కు కేవలం 3 టీ20 మ్యాచ్లు మాత్రమే ఉండడం కాస్త నిరుత్సాహ పరిచే అంశం అన్నాడు.
'టీమ్లో ఉన్న ప్లేయర్లందరికీ బరిలోకి దిగే అవకాశం వస్తుందని చెప్పలేం. యువ ఆటగాళ్లంతా తమ టాలెంట్ను ప్రూవ్ చేసుకోవాలని చాలా ఆత్రుతగా ఉన్నారు. ఈ పర్యటనకు వస్తున్న సెలెక్టర్లు కుర్రాళ్ల పెర్ఫామెన్స్ను నిశితంగా పరిశీలిస్తారు. టీ20 వరల్డ్ కప్ నేపథ్యంలో చాలా మంది ప్లేయర్లు ఫైనల్ టీమ్లో చాన్స్ కోసం ఎదురు చూస్తున్నారు. అయితే, మా గోల్ మాత్రం ముందుగా సిరీస్ నెగ్గడమే. ఈ సిరీస్లో బాగా రాణించిన వాళ్లకు మున్ముందు మరిన్ని అవకాశాలు లభిస్తాయి.
ఇక, టీ20 వరల్డ్ కప్ ప్లాన్స్ను ఇంప్లిమెంట్ చేసే విషయంలో టీమ్ మేనేజ్మెంట్తో టచ్లో ఉంటా. ఒకసారి శ్రీలంకలో అడుగు పెట్టాక.. అందరితో మాట్లాడుతా. వాళ్ల ఆలోచనలు ఏంటో తెలుసుకుంటా' అని ద్రవిడ్ పేర్కొన్నాడు. భారత జట్టుకు సారథ్యం వహించడం తనకు కొత్త సవాల్ అని శిఖర్ ధావన్ తెలిపాడు. తమకు ఈ పర్యటన బంగారం లాంటి అవకాశమని కూడా చెప్పుకొచ్చాడు. సీనియర్లు, యువ ప్లేయర్లతో కలిసి టీమ్ సమతూకంగా ఉందన్నాడు.
ఈ ఏడాది చివర్లో టీ20 వరల్డ్కప్నకు ముందు ఆడనున్న ఈ లిమిటెడ్ ఓవర్ల సిరీస్లో శిఖర్ ధావన్, భువనేశ్వర్ కుమార్, హార్దిక్ పాండ్యా వంటి సీనియర్లతో పాటు ఆరుగురు అన్క్యాప్డ్ ప్లేయర్లు పోటీ పడుతున్నారు. ఈ టూర్లో సత్తా చాటి టీ20 వరల్డ్కప్లో ప్లేస్ దక్కించుకోవాలని సీనియర్లతో పాటు యంగ్స్టర్స్ భావిస్తున్నారు. ఈ నెల 13 నుంచి జరిగే మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్ల కోసం ధావన్ కెప్టెన్సీలోని భారత జట్టు నేడు( సోమవారం) శ్రీలంకకు వెళ్లనుంది.