న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా పర్యటనలో ఎన్నో ప్రతికూలతల మధ్య భారత్ అద్భుత విజయాన్నందుకున్న విషయం తెలిసిందే. గాయాలతో సీనియర్ ఆటగాళ్లు దూరమైన వేళ యువ ఆటగాళ్లు అవకాశాలను అందిపుచ్చుకొని సత్తా చాటడంతో టీమిండియా చారిత్రాత్మక విజయాన్నందుకుంది. అందుకే ఈ గెలుపు భారత్ క్రికెట్ చరిత్రలో ప్రత్యేకంగా నిలిచిపోయింది.
పెటర్నిటీ లీవ్ మీద కెప్టెన్ విరాట్ కోహ్లీ దూరమవడం.. ఫస్ట్ టెస్ట్లో 36 పరుగులకే పరిమితమై ఘోర పరాజయం చవిచూడటం, సీనియర్ ఆటగాళ్లంతా గాయపడుతూ ఒక్కొక్కరుగా జట్టుకు దూరమవడంతో భారత్ గెలవడం దేవుడెరుగు కనీసం పోరాడితే చాలని భావించారంతా. కానీ యువ క్రికెటర్లు మహ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, శుభ్మన్ గిల్, రిషభ్ పంత్ సత్తా చాటడంతో ఆసీస్ చిత్తయింది. అయితే ఈ యువ ఆటగాళ్లు రాణించడానికి కారణం టీమిండియా మాజీ క్రికెటర్, నేషనల్ క్రికెట్ అకాడమీ డైరెక్టర్ రాహుల్ ద్రవిడే కారణమని మాజీ క్రికెటర్లు కొనియాడారు.
భారత్-ఏ, అండర్-19 కోచ్గా పనిచేసిన ద్రవిడ్.. ఏ పరిస్థితుల్లోనైనా ఆడగలిగేలా యువ ఆటగాళ్లను మానసికంగా సిద్దం చేశాడని, ఆ కారణంగా వారు ఆసీస్ పర్యటనలో సత్తా చాటారని దివాల్ను ప్రశంసించారు. అయితే ఈ ప్రశంసలపై తాజాగా స్పందించిన రాహుల్ ద్రవిడ్.. తనకు అనవసర క్రెడిట్ ఇస్తున్నారని వాపోయాడు. యువ ఆటగాళ్లు రాణించడంలో తన పాత్ర ఏం లేదని, ప్రశంసలన్నిటీకీ వారే అర్హులని ఇండియన్ ఎక్స్ప్రెస్తో మాట్లాడుతూ అన్నాడు. 'నాకు అనవసర క్రెడిట్ ఇస్తున్నారు. కుర్రాళ్లే అన్ని ప్రశంసలకు అర్హులు'అని ద్రవిడ్ స్పష్టం చేశాడు.