
అహ్మదాబాద్: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని గెలుచుకోవడంపై టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ సంతోషం వ్యక్తం చేశాడు. చాలా రోజుల తర్వాత తీవ్రంగా పోటీపడి గెలిచిన సిరీస్ అని తెలిపాడు. ఈ సిరీస్లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టెస్ట్ డ్రా కావడంతో 2-1 తేడాతో సిరీస్ టీమిండియా వశమైంది. ఈ మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడిన రాహుల్ ద్రవిడ్.. డబ్ల్యూటీసీ ఫైనల్కు సంబంధించిన ప్రణాళికలు సిద్దం చేసుకోవాలని చెప్పాడు. భారత్ మ్యాచ్తో పాటు న్యూజిలాండ్-శ్రీలంక మ్యాచ్ను కూడా ఫాలో అయ్యామని తెలిపాడు.
'చాలా రోజుల తర్వాత తీవ్రంగా పోటీపడిన సిరీస్ ఇది. తీవ్ర ఒత్తిడిలోనూ భారత ఆటగాళ్లు అద్భుతంగా రాణించారు. తొలి టెస్టులోనే కెప్టెన్ రోహిత్ శర్మ సూపర్ సెంచరీతో సిరీస్ను ఘనంగా ప్రారంభిస్తే.. చివరి మ్యాచ్లో విరాట్ కోహ్లీ అద్భమైన శతకంతో ముగించాడు. అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, శుభ్మన్ గిల్, అశ్విన్ అసాధారణ ప్రదర్శన కనబర్చారు. ముఖ్యంగా శుభ్మన్ గిల్ తొలి రెండు టెస్టుల్లో బెంచ్కే పరిమితమైనప్పటికీ.. వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు.
గత నాలుగైదు నెలలుగా శుభ్మన్ గిల్ సూపర్ ఫామ్లో ఉన్నాడు. ఇలాంటి యువ ప్లేయర్ ఆటను చూడటం చాలా బాగుంది. ఎప్పటికప్పుడూ స్కిల్స్ను మెరుగుపర్చుకునేందుకు గిల్ తీవ్రంగా శ్రమిస్తాడు. నాలుగో టెస్టు డ్రాగా ముగుస్తుందని తెలిసినా... న్యూజిలాండ్ - శ్రీలంక మ్యాచ్ ఫలితం ఎలా ఉంటుందనేదానిపై మేం ఓ కన్నేసాం. న్యూజిలాండ్ విజయం కోసం ప్రయత్నించడం.. వికెట్లు పారేసుకోవడం ఆశ్చర్యానికి గురి చేసింది. కివీస్ విజయం కోసం ఎందుకు ప్రయత్నిస్తుందనే ఫీలింగ్ కలిగింది. అయితే ఈ టెస్టు లంచ్ బ్రేక్ సమయానికి ఆ మ్యాచ్ ఫలితం కూడా తేలిపోయింది.
ఆస్ట్రేలియాకు అద్భుతమైన ఇద్దరు యువ స్పిన్నర్లు దొరికారు. టాడ్ మర్ఫీ, మాథ్యూ కుహ్నేమన్ చాలా చక్కగా బౌలింగ్ చేశారు. విదేశీ జట్లలో ఒకేఒక్క నాణ్యమైన స్పిన్నర్ ఉండేవాడు. కానీ, ఈసారి మాత్రం లయన్తోపాటు ఈ యువ స్పిన్నర్లు కూడా బాగా వేశారు. ఇక డబ్ల్యూటీసీ ఫైనల్ గురించి మేం ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. ఐపీఎల్ ముగిసిన వారం రోజులకే ఈ బిగ్ మ్యాచ్ ఉండటం మాకు అతి పెద్ద సవాల్. అయితే ముందుగా ఈ సిరీస్ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటాం'అని రాహుల్ ద్రవిడ్ చెప్పుకొచ్చాడు.