దేశవాళీ ప్రతిష్టాత్మక క్రికెట్ టోర్నీ రంజీ ట్రోఫీకి దూరంగా ఉన్న శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్లపై బీసీసీఐ క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. వార్షిక కాంట్రాక్ట్ల్లో చోటివ్వకుండా వేటు వేసింది. టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ సూచనలతోనే బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుందని అప్పట్లో జోరుగా ప్రచారం జరిగింది.
తాజాగా ఇదే విషయాన్ని రాహుల్ ద్రవిడ్ ముందు ప్రస్తావించగా... తనకేం తెలియదని సమాధానమిచ్చాడు. భారత ఆటగాళ్ల కాంట్రాక్ట్ల విషయంలో తన ప్రమేయం లేదని స్పష్టం చేశాడు. అసలు ఏ ప్రాతిపాదికన కాంట్రాక్ట్లు ఇస్తారో కూడా తనకు తెలియదని చెప్పాడు. ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్లు మళ్లీ భారత జట్టులోకి తిరిగొస్తారని ఆశాభావం వ్యక్తం చేశాడు.

'భారత ఆటగాళ్ల వార్షిక కాంట్రాక్ట్లను నేను డిసైడ్ చేయలేదు. అసలు ఏ ప్రాతిపాదికన కాంట్రాక్ట్లు ఇస్తారో కూడా నాకు తెలియదు. శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్లు సూపర్ ఫిట్నెస్తో అద్భుతమైన ప్రదర్శన కనబర్చి జట్టులోకి ఎంపిక చేసేలా పుంజుకుంటారని ఆశిస్తున్నా. కాంట్రాక్ట్ల్లో లేని ఆటగాళ్లు కూడా టీమిండియా రేసులో ఉంటారు.'అని రాహుల్ ద్రవిడ్ స్పష్టం చేశాడు.
టెస్ట్ క్రికెట్ ఆడేందుకు బీసీసీఐ అందిస్తున్న ఇన్సెంటీవ్.. నగదు ప్రోత్సాహకం కాదని, ఓ గుర్తింపు అని రాహుల్ ద్రవిడ్ స్పష్టం చేశాడు. 100 టెస్ట్ల ఘనతను సెలెబ్రేట్ చేసినట్లు 100 టీ20ల రికార్డును జరుపుకోమని గుర్తు చేశాడు.
'టెస్ట్ క్రికెట్ ఆడేందుకు డబ్బు ప్రోత్సాహకం కాదని నేను భావిస్తున్నా. ఇది కఠినమైన ఫార్మాట్లో దక్కే గుర్తింపు మాత్రమే. 100 టెస్ట్ల రికార్డు మాదిరి 100 టీ20ల ఘనతను జరుపుకోం కదా..? బీసీసీఐ అందించేది ప్రోత్సాహకం కాదు. క్యాష్ రివార్డ్.'అని ద్రవిడ్ స్పష్టం చేశాడు.
అద్భుత ప్రదర్శన కనబర్చిన కుల్దీప్ యాదవ్పై రాహుల్ ద్రవిడ్ ప్రశంసల జల్లు కురిపించాడు. జట్టులో తీవ్ర పోటీ ఉన్నా.. వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడని, బ్యాటింగ్ను మెరుగుపరుచుకోవడం అతనికి బోనస్ అని కొనియాడాడు. కుల్దీప్ యాదవ్ను విదేశాల్లో ఆడించడంపై ఎదురైన ప్రశ్నకు తనదైన శైలిలో బదులిచ్చాడు.
కాస్త టైమ్ పడుతుందని, 500 వికెట్లు తీసిన అశ్విన్ కూడా విదేశాల్లో రిజర్వ్ బెంచ్పైనే కూర్చుంటాడని గుర్తు చేశాడు. అక్కడి పిచ్కు తగ్గట్లు స్పిన్నర్లు ఆడించాల్సి ఉంటుందన్నాడు.