
న్యూఢిల్లీ: సౌతాఫ్రికా పర్యటనలో భాగంగా రేపటి నుంచి ప్రారంభమయ్యే ఫస్ట్ టెస్ట్లో టీమిండియా వెటరన్ బ్యాట్స్మన్ అజింక్యా రహానే బరిలోకి దిగే అవకాశం ఉంది. అనుభవం, విదేశాల్లో మెరుగైన రికార్డు ఉన్న నేపథ్యంలో టీమ్మేనేజ్మెంట్ అతనికే అవకాశమిచ్చినట్లు తెలుస్తోంది. గతేడాది కాలంగా రహానే పెద్దగా రాణించిందేం లేదు. మెల్ బోర్న్ టెస్ట్ సెంచరీ తర్వాత మళ్లీ చెప్పుకొదగ్గ ఇన్నింగ్స్ ఒక్కటి ఆడలేదు. ఈ క్రమంలోనే టెస్ట్ వైస్ కెప్టెన్సీ కూడా కోల్పోయాడు. దాందో సౌతాఫ్రికా పర్యటనే అతనికి చివరి అవకాశమైపోయింది. అయితే తొలి టెస్ట్లో అతనికి చోటు దక్కదని అంతా భావించారు. కానీ టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ మాత్రం అతను ఆడే విషయంపై హింట్ ఇచ్చాడు.
టెస్టు సిరీస్ ప్రారంభానికి ముందు ఆనవాయితీ ప్రకారం శనివారం మీడియాతో మాట్లాడిన ద్రవిడ్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. అయితే తుది జట్టు కాంబినేషన్ గురించి మాత్రం సమాధానాలు చెప్పలేదు. తొలి టెస్టుకు అజింక్యా రహానే, ఇషాంత్ శర్మలు బెంచ్కే పరిమితం కానున్నారని వచ్చిన వార్తల నేపథ్యంలో తొలి టెస్టుకు టీమిండియా తుది జట్టు ఎలా ఉండబోతుందన్న ప్రశ్న ద్రవిడ్కు ఎదురైంది. అయితే వీటన్నింటికి ద్రవిడ్ తనదైన శైలిలో సమాధానం ఇచ్చాడు.
'వాళ్లంతా ప్రొఫెషనల్ క్రికెటర్లు. తుది జట్టులో ఎవరిని ఉంచాలి.. ఎవరిని తీయాలనేది మాకు తలనొప్పిగా మారింది. కానీ జట్టులో 11 మంది మాత్రమే ఆడాలనే రూల్ ఉండటంతో ఎవరో ఒకరు బెంచ్కే పరిమితం కావాల్సి ఉంటుంది. ఈ విషయం మా ఆటగాళ్లు అర్థం చేసుకుంటారనే అనుకుంటున్నా. ప్రొటీస్తో తొలి టెస్ట్కు ప్లేయింగ్ ఎలెవెన్ ఎలా ఉండబోతుందనే దానిపై మాకు క్లారిటీ ఉంది. కానీ టీమిండియా ప్లేయింగ్ ఎలెవెన్ను రివీల్ చేయడం ఇష్టం లేదు. అలా చేస్తే ప్రత్యర్థికి మనం అవకాశం ఇచ్చినట్లే అవుతుంది.'' అని చెప్పుకొచ్చాడు.
ఇక కీలకమైన ఐదో స్థానంలో రహానే, విహారీ, అయ్యర్లలో ఎవరిని చూడొచ్చు అన్న ప్రశ్నకు ద్రవిడ్ మాట్లాడుతూ.. 'బ్యాటింగ్ ఆర్డర్పై ఇప్పటికే అందరు ప్లేయర్స్తో చర్చించా. ముఖ్యంగా పుజారా, రహానేల బ్యాటింగ్ ఆర్డర్పై వారితో చాలాసేపు మాట్లాడా. కానీ తొలి టెస్టులో ఐదో స్థానంలో బ్యాటింగ్కు ఎవరు వస్తారనేది ఇప్పుడు చెప్పను.'' అని తెలిపాడు. అయితే సమావేశం చివర్లో..'' ఈ వారం రహానేకు మంచి ప్రాక్టీస్ దొరికింది'' అంటూ ద్రవిడ్ చెప్పడం చూస్తే పరోక్షంగా రహానే తుది జట్టులో ఉండే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.