
సెంచూరియన్: తన కళ్ల ముందే టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒక్కో మెట్టు ఎక్కుతూ ఈ స్థాయికి ఎదగడం నిజంగా అద్భుతమని హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ అన్నాడు. పదేళ్ల టెస్ట్ కెరీర్లో విరాట్ కోహ్లీ ఆటగాడిగా ఎంతో పరిణతి సాధించాడని తెలిపాడు. కెరీర్ ప్రారంభంలోని కోహ్లీకి ఇప్పటికి చాలా తేడా ఉందన్నాడు. కెరీర్లో ఒక్కో మెట్టు ఎక్కుతూ ఈ స్థాయికి చేరాడని ప్రశంసించాడు. సౌతాఫ్రికా పర్యటనలో ఉన్న భారత జట్టు ఆదివారం నుంచి సెంచూరియన్ వేదికగా తొలి టెస్ట్ ఆడనుంది. ఈ మ్యాచ్ నేపథ్యంలో బీసీసీఐ టీవీతో మాట్లాడిన రాహుల్ ద్రవిడ్.. విరాట్ కోహ్లీపై ప్రశంసల జల్లు కురిపించాడు.
'2011లో విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్లోకి అరంగేట్రం చేసే నాటికి.. నేను ఇంకా క్రికెట్లో కొనసాగుతూనే ఉన్నాను. అతడితో కలిసి కొన్ని మ్యాచులు కూడా ఆడాను. ఈ పదేళ్ల కాలంలో కోహ్లీ ఒక ఆటగాడిగా, పరిపూర్ణమైన వ్యక్తిగా ఎంతో పరిణతి సాధించాడు. ఒక్కో మెట్టు ఎక్కుతూ కెప్టెన్ స్థాయికి ఎదగడం అద్భుతంగా అనిపిస్తోంది. ఆటలో పర్ఫెక్షన్ కోసం ఎప్పుడూ కష్టపడుతూనే ఉంటాడు. ఓ కెప్టెన్గా ఆటగాళ్ల ఫిట్నెస్ విషయంలో చాలా విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చాడు' అని రాహుల్ ద్రవిడ్ చెప్పుకొచ్చాడు. ఇప్పటి వరకు 97 టెస్టులు ఆడిన కోహ్లీ 50.65 సగటుతో 7,801 రన్స్ చేశాడు. ఇందులో 27 సెంచరీలతో పాటు 27 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
2011లో వెస్టిండీస్తో జరిగిన టెస్టు సిరీస్లో కోహ్లీ సుదీర్ఘ ఫార్మాట్లోకి అరంగేట్రం చేశాడు. తొలి ఇన్నింగ్స్లో నాలుగు పరుగులు, రెండో ఇన్నింగ్స్లో 15 పరుగులు చేశాడు. ద్రవిడ్తో కలిసి నాలుగో వికెట్కు 43 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అయితే, రెండు ఇన్నింగ్స్ల్లో కూడా ద్రవిడ్తో కలిసి బ్యాటింగ్ చేయడం విశేషం. ఆ మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్లో 40, రెండో ఇన్నింగ్స్లో 112 పరుగులు చేసిన ద్రవిడ్ 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచాడు. ఐపీఎల్ ఆరంభ సీజన్లలో కూడా ఈ ఇద్దరూ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) జట్టుకు ప్రాతినిథ్యం వహించారు.