టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్ 2024తో హెడ్ కోచ్గా అతని పదవి కాలం ముగియడంతో డ్రెస్సింగ్ రూమ్లో జట్టు విజయాన్ని, ఆటగాళ్లను ఉద్దేశించి చివరిసారిగా మాట్లాడాడు. ఈ సందర్భంగా అందరికీ కృతజ్ఞతలు తెలిపిన రాహుల్ ద్రవిడ్.. ఎమోషనల్ స్పీచ్తో టీమిండియాకు గుడ్బై చెప్పాడు. ఈ వీడియోను బీసీసీఐ తాజాగా విడుదల చేయగా వైరల్ అయ్యింది.
బార్బోడస్ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్లో టీమిండియా 7 పరుగుల తేడాతో సౌతాఫ్రికాను ఓడించి విశ్వవిజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ గెలుపుతో 11 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు టీమిండియా తెరదించింది. చివరగా ధోనీ సారథ్యంలో 2013 ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన టీమిండియా.. మళ్లీ ఇన్నాళ్లు ఐసీసీ టైటిల్ ముద్దాడింది.

ప్లేయర్గా ప్రపంచకప్ సాధించలేని రాహుల్ ద్రవిడ్ కోచ్గా ఆ ముచ్చట తీర్చుకున్నాడు. 2021 టీ20 ప్రపంచకప్ పరాజయం అనంతరం రాహుల్ ద్రవిడ్.. టీమిండియా హెడ్ కోచ్గా బాధ్యతలు చేపట్టాడు. అతని పర్యవేక్షణలో టీమిండియా టీ20 ప్రపంచకప్ 2022 సెమీస్లో, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023 ఫైనల్లో, వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్లో ఓటమిపాలైంది.
ఈ టీ20 ప్రపంచకప్ ముందే టీమిండియా హెడ్ కోచ్ పదవికి రాహుల్ ద్రవిడ్ గుడ్బై చెప్పాడు. ఓడినా.. గెలిచినా ఇదే నా చివరి టోర్నీ అని చెప్పాడు. మొత్తానికి ఈ టోర్నీలో టీమిండియా అసాధారణ ప్రదర్శనతో విజేతగా నిలిచింది. టీమిండియా ఆటగాళ్లు సైతం రాహుల్ ద్రవిడ్కు ప్రపంచకప్ టైటిల్తో వీడ్కోలు పలికారు. డ్రెస్సింగ్ రూమ్లో రాహుల్ ద్రవిడ్ ఆఖరి సరిగా మాట్లాడాడు.
'నిజం చెప్పాలంటే ఏం మాట్లాడాలో నాకు తెలియడం లేదు. మన జీవిత కాలంలో ఈ క్షణాలు ఎప్పటికీ గుర్తుండి పోతాయి. ఇంత గొప్ప విజయం అందించిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు. ఎన్నో త్యాగాలు చేసి మీరంతా ఇంత దూరం వచ్చారు. మనందరి కష్టానికి తగ్గ ఫలితం వచ్చింది. ఏ ఆటగాడైనా తాను చేసిన పరుగులు, సెంచరీలు గుర్తు పెట్టుకోడు. కానీ ఇలాంటి విజయాలు జీవితాంతం గుర్తుంటాయి.
జట్టు ప్రయాణంలో ఒడిదొడుకులు ఎదురైనా.. పోరాడిన విధానం అద్భుతం. మన విజయం పట్ల యావత్ భారత్ గర్విస్తోంది. జట్టులోని ప్రతీ ఒక్కరికి థ్యాంక్స్. కెప్టెన్ రోహిత్ శర్మకు ప్రత్యేక ధన్యవాదాలు. కోచ్గా కొనసాగాలని ఒప్పించినందుకు కృతజ్ఞతలు. ఈ ప్రయాణంలో మన మధ్య ఎన్నో చర్చలు జరిగాయి. కొన్నిటికీ ఏకీభవిస్తే.. మరికొన్నింటికి విభేదించావు.'అని రాహుల్ ద్రవిడ్ చెప్పుకొచ్చాడు.