
ఆ వికెట్ తీయలేకపోయాం..
'ఈ సిరీస్ను విజయంతో ముగించడం బాగుంది. కానీ, కాన్పూర్లోనే ఆఖరి వికెట్ తీయలేకపోయాం. అదే కాస్త నిరాశకు గురిచేసింది. అయినా భారత జట్టు అద్భుతంగా ఆడింది. ఆటగాళ్లకే ఆ క్రెడిటంతా దక్కుతుంది. కఠిన పరిస్థితుల నుంచి బాగా పుంజుకున్నారు. యువకులు బాగా ఆడారు. సీనియర్లు లేకున్నా తమకు అంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నారు. జయంత్ యాదవ్ ఆదివారం రాణించకపోయినా ఈరోజు ఉదయం నాలుగు వికెట్లతో మెరిశాడు. ముఖ్యంగా శ్రేయస్ అయ్యర్, మయాంక్ అగర్వాల్, అక్షర్ పటేల్, జయంత్ యాదవ్ లాంటి ఆటగాళ్లు ఎక్కువ టెస్టు మ్యాచ్లు ఆడే అవకాశం రాదు. అయినా వారు ఇలా ఆడటం బాగుంది.

ఆటగాళ్ల గాయాలు..
అలాగే మేం రెండో ఇన్నింగ్స్లో తొలుత డిక్లేర్ చేయాలని అనుకోలేదు. ఎందుకంటే ఆటలో ఇంకా చాలా సమయం మిగిలి ఉండటంతో న్యూజిలాండ్ను ఎలాగైనా ఆలౌట్ చేస్తామనే నమ్మకం ఉంది. ఇలాంటి ఎర్రమట్టి వికెట్పై బంతి బౌన్స్ అవుతున్న వేళ బ్యాటింగ్ చేయడం యువకులను మరింత మేటి ఆటగాళ్లుగా తీర్చిదిద్దుతుంది. ఈ మ్యాచ్లో ఆడేటప్పుడు పలువురు ఆటగాళ్లు గాయపడ్డారు. అది కాస్త ఆందోళనకు గురిచేస్తోంది. ఫార్మాట్లకు అతీతంగా ఆటగాళ్లు చాలా మ్యాచ్లు ఆడుతున్న నేపథ్యంలో వాళ్లపై పనిభారం పడకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో యువకులు జట్టులో స్థానం కోసం పోటీపడుతున్నారు. దాంతో ఎవరిని ఎలా ఆడించాలనేది తలనొప్పిగా మారింది'అని రాహుల్ ద్రవిడ్ చెప్పుకొచ్చాడు.

సమష్టిగా రాణించి..
ముంబై వేదికగా జరిగిన ఈ రెండో టెస్ట్లో 540 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ భారత స్పిన్నర్ల ధాటికి రెండో ఇన్నింగ్స్లో 167 పరుగులకే కుప్పకూలింది. డారిల్ మిచెల్(92 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్లతో 60), హెన్రీ నికోల్స్(111 బంతుల్లో 8 ఫోర్లు 44), విల్ యంగ్ (41 బంతుల్లో 4 ఫోర్లతో 20), రచిన్ రవీంద్ర(50 బంతుల్లో 4 ఫోర్లతో 18) మినహా అంతా సింగిల్ డిజిట్కే పరిమితయ్యారు. భారత బౌలరల్లో రవిచంద్రన్ అశ్విన్, జయంత్ యాదవ్ చెరో నాలుగు వికెట్లు పడగొట్టారు.
భారత్ తొలి ఇన్నింగ్స్లో 325 పరుగులు చేయగా.. కివీస్ కేవలం 62 పరుగులకే ఆలౌటైంది. ఇక రెండో ఇన్నింగ్స్లో టీమిండియా 276/7 స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది. సెంచరీ, హాఫ్ సెంచరీతో రాణించిన మయాంక్ అగర్వాల్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కగా.. రవిచంద్రన్ అశ్విన్కు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ వరించింది.


Click it and Unblock the Notifications
