ఐపీఎల్ 2025 మెగా వేలంలో రాజస్థాన్ రాయల్స్ 13 ఏళ్ల వైభవ్ సూర్య వంశీని కొనుగోలు చేసింది. దాంతో ఐపీఎల్ చరిత్రలోనే అమ్ముడైన అతి పిన్న వయస్కుడిగా వైభవ్ సూర్య వంశీ నిలిచాడు. ఒక కోటి 10 లక్షల రూపాయాలకు రాజస్థాన్ రాయల్స్ అతన్ని సొంతం చేసుకోవడంతో వైభవ్ సూర్య వంశీ టాక్ ఆఫ్ ది టౌన్గా నిలిచాడు. రూ. 30 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన ఈ బాలుడి కోసం రాజస్థాన్ రాయల్స్.. ఢిల్లీ క్యాపిటల్స్తో పోటీ పడి మరి తీసుకుంది.
అయితే వైభవ్ సూర్య వంశీని తీసుకోవడానికి గల కారణాన్ని రాహుల్ ద్రవిడ్ తాజాగా వెల్లడించాడు. రాజస్థాన్ రాయల్స్ నిర్వహించిన ట్రయల్స్లో సూర్య వంశీ అద్భుత ప్రదర్శన కనబర్చాడని చెప్పాడు.

మా ట్రయల్స్లో రాణించడంతోనే..
'సూర్యవంశీలో మంచి నైపుణ్యాలు ఉన్నాయి. అతను క్రికెటర్గా ఎదిగేందుకు మా జట్టే మంచి వాతావరణమని మేం భావించాం. వైభవ్ మా ట్రయల్స్కు హాజరయ్యాడు. అద్భుత ప్రదర్శన కనబర్చాడు. అతని ఆటకు మేం ఫిదా అయ్యాం.'అని రాహుల్ ద్రవిడ్ చెప్పుకొచ్చాడు. ఈ వీడియోను ఐపీఎల్ నిర్వాహకులు సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.
వైభవ్ సూర్య వంశీ తండ్రి సంజీవ్ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించాడు. వేలం కంటే ముందు నాగ్పూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్ నిర్వహించిన ట్రయల్స్లో సూర్యవంశీ పాల్గొన్నాడని చెప్పాడు. రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ పెట్టిన టెస్ట్ను పాసయ్యాడని చెప్పాడు. ఒకే ఓవర్లో 17 పరుగులు చేయాలని విక్రమ్ రాథోడ్ అడగ్గా.. వైభవ్ మూడు సిక్సర్లు బాదడని తెలిపాడు. ఈ ట్రయల్స్లో వైభవ్ మొత్తం 8 సిక్సర్లు, నాలుగు ఫోర్లు కొట్టాడని సంజీవ్ చెప్పుకొచ్చాడు.
నా కొడుక్కి 13 ఏళ్లే..
తన కొడుకు వయసుపై జరుగుతున్న ప్రచారాన్ని కూడా అతను కొట్టిపారేసాడు. సూర్యవంశీ వయసు 13 ఏళ్లేనని, 8 సంవత్సరాల 6 నెలల వయసులోనే సూర్యవంశీ బీసీసీఐ ఎముక పరీక్షకు హాజరయ్యాడని తెలిపాడు. కావాలంటే ఇప్పుడు కూడా పరీక్ష చేయించుకోవచ్చన్నాడు.
చివరిసారిగా భారత్ వన్డే ప్రపంచకప్ 2011 గెలిచిన ఏడాది పుట్టిన ఈ కుర్రాడు.. అప్పుడే ఐపీఎల్లోకి అరంగేట్రం చేసేందుకు సిద్దమయ్యాడు. బిహార్కు చెందిన వైభవ్ సూర్యవంశీ.. అండర్ 19 ఆసియాకప్ టోర్నీకి కూడా ఎంపికయ్యాడు. ప్రస్తుతం అతను ఈ టోర్నీ కోసమే దుబాయ్లో ఉన్నాడు.
బీహార్ తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్..
ఆస్ట్రేలియా అండర్ 19 జట్టుతో జరిగిన యూత్ టెస్ట్లో సూర్య వంశీ సెంచరీ బాది ఈ ఘనత సాధించిన అత్యంత పిన్నవయస్కుడిగా చరిత్రకెక్కాడు. ఈ మ్యాచ్లో వైభవ్ 62 బంతుల్లో 104 పరుగులు చేశాడు. 58 బంతుల్లోనే సెంచరీ మార్క్ అందుకున్నాడు. దాంతో యూత్ టెస్ట్ల్లో అత్యంత వేగవంతమైన సెంచరీ రికార్డ్ సాధించాడు. 12 ఏళ్ల 284 రోజుల వయసులోనే సూర్య వంశీ.. బీహార్ తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్లోకి అరంగేట్రం చేసి చరిత్ర సృష్టించాడు.