న్యూఢిల్లీ: టీమిండియాలో చేసిన ప్రయోగాలపై హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ స్పందించాడు. జట్టులో ప్రయోగాలు చేయడం తమకు సరదా కాదని, ఆటగాళ్లు గాయాల బారిన పడటంతోనే ఇతర ఆటగాళ్లను ప్రయత్నించామని స్పష్టం చేశాడు. వన్డే ప్రపంచకప్కు సమయం దగ్గరపడుతున్నా కొద్దీ టీమిండియా కాంబినేషన్పై క్లారిటీ లేకపోవడం విమర్శలకు దారితీసింది.
తుది జట్టులో ఎవరిని ఆడిస్తారనే కన్ఫ్యూజన్ ఇప్పటికీ నెలకొంది. శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్ గాయాల బారిన పడటంతో మిడిలార్డర్లో చాలా మంది ఆటగాళ్లను ప్రయత్నించారు. దాంతో ఆటగాళ్ల స్థానాలపై గందరగోళ పరిస్థితి ఏర్పడింది.

ఆసియాకప్ 2023 నేపథ్యంలో మంగళవారం మీడియాతో మాట్లాడిన రాహుల్ ద్రవిడ్ ఈ అంశాలపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. జట్టు ప్రయోగాలపై వచ్చిన విమర్శలపై కాస్త ఘాటుగానే బదులిచ్చాడు.
18 నెలల క్రితమే వన్డే ప్రపంచకప్ కోసం ఏ ఆటగాళ్లను తీసుకోవాలనేదానిపై నిర్ణయం తీసుకున్నామని, కానీ స్వల్ప వ్యవధిలో కీలక ఆటగాళ్లు గాయపడటం ప్రణాళికలను దెబ్బతీసిందన్నాడు. వారి స్థానాల్లో ఇతర ఆటగాళ్లను ఆడించాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పాడు.
'బ్యాటింగ్ ఆర్డర్లో చాలా రోజులుగా నాలుగు, ఐదు స్థానాల గురించి చర్చ నడుస్తోంది. ఆ స్థానాల్లో ఎవరు ఆడాలనే దానిపై మాకు స్పష్టత లేదనే ప్రచారం జరుగుతోంది. కానీ, ఈ రెండు స్థానాల కోసం 18-19 నెలల ముందుగానే శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్లను సెలెక్ట్ చేశాం.
కానీ దురదృష్టవశాత్తు ఈ ముగ్గురు కొన్ని నెలల వ్యవధిలోనే గాయాల బారిన పడి జట్టుకు దూరమయ్యారు. ప్రపంచకప్ నాటికి వీళ్లు అందుబాటులోకి రాకుంటే వీరి స్థానాల్లో ఎవరు రాణించగలరో తెలుసుకోవడం కోసం కొంతమందిని పరీక్షించాం.
వీటి గురించి ఆలోచించకుండా ప్రయోగాలు చేశామని విమర్శిస్తున్నారు. కొన్నిసార్లు ఇలా చేయడానికి కారణాలుంటాయి. శ్రేయస్ అయ్యర్ కోలుకున్నాడు. ఇప్పడు అతనే బరిలోకి దిగుతాడు. ఆసియాకప్లో అవకాశం ఇచ్చి ప్రపంచకప్కు సిద్దం చేయాలనుకుంటున్నాం. ప్రస్తుతం అతను అన్ని విధాలుగా మ్యాచ్కు సిద్దంగా ఉన్నాడు.'అని రాహుల్ ద్రవిడ్ చెప్పుకొచ్చాడు.
ఆసియాకప్ 2023 టోర్నీ బుధవారం ప్రారంభం కానుండగా తొలి మ్యాచ్లో ఆతిథ్య పాకిస్థాన్, నేపాల్ జట్లు తలపడనున్నాయి. సెప్టెంబర్ 2 జరిగే మ్యాచ్లో భారత్-పాకిస్థాన్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ టోర్నీ ముగిసిన అనంతరం అక్టోబర్ 5 నుంచి భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్ జరగనుంది.