
న్యూఢిల్లీ: దిగ్గజ క్రికెట్ ఆటగాళ్లకు భారత్ నిలయం. తరతరాలుగా ఎందరో గొప్ప ఆటగాళ్లు ప్రపంచానికి పరిచయమవుతున్నారు. తమ సత్తాతో అద్భుత ఆటగాళ్లుగా గుర్తింపు పొందుతున్నారు. ఈ క్రమంలోనే మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ప్రపంచం మెచ్చిన ఆటగాడిగా మన్ననలు అందుకున్నాడు. స్వదేశీ అభిమానులతో పాటు విదేశీ ఫ్యాన్స్ అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. భారత గొప్ప బ్యాట్స్మెన్గా చరిత్రకెక్కాడు. అది ఏ ఫార్మాట్ అయినా ఎవరిని అడిగినా.. భారత్ నుంచి సచినే గొప్ప ఆటగాడు అంటారు. ఆ తర్వాత సునీల్ గవాస్కర్, విరాట్ కోహ్లీ, రాహుల్ ద్రవిడ్ ఇలా వరుసగా చెప్తారు.
కానీ తాజాగా విజ్డెన్ ఇండియా నిర్వహించిన పోల్లో భిన్నాభిప్రాయం వ్యక్తం అయింది. గత 50 ఏళ్లలో భారత గొప్ప టెస్టు బ్యాట్స్మెన్ ఎవరు..? అనే ప్రశ్నతో విజ్డెన్ ఇండియా ఓ పోల్ని నిర్వహించగా ఎవరూ ఊహించని రీతిలో రాహుల్ ద్రవిడ్ విజేతగా నిలిచాడు. పోల్లో మొత్తం 11,400 మంది అభిమానులు తమ అభిప్రాయాన్ని చెప్పగా.. రాహుల్ ద్రవిడ్కి ఏకంగా 52 శాతం ఓట్లు పడినట్లు విజ్డెన్ ఇండియా ప్రకటించింది. సచిన్ ఆఖరి వరకూ గట్టి పోటీనిచ్చినా 48 శాతంతో రెండో స్థానానికి పరిమితమైనట్లు వెల్లడించిన విజ్డెన్ ఇండియా.. విరాట్ కోహ్లీ, సునీల్ గవాస్కర్ వరుసగా 3, 4 స్థానాలతో సరిపెట్టారు.

భారత్ తరఫున 200 టెస్టులాడిన సచిన్ టెండూల్కర్ 53.78 సగటుతో 15,921 పరుగులు చేశాడు. ఇక రాహుల్ ద్రవిడ్ 164 టెస్టులాడి 52.31 సగటుతో 13,288 రన్స్ చేయగా.. సునీల్ గవాస్కర్ 125 టెస్టుల్లో 51.12 సగటుతో 10,122 పరుగులు చేశాడు. ఆఖరిగా భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆడిన 86 టెస్టుల్లోనే 53.62 సగటుతో 7,240 పరుగులు చేశాడు. అత్యధిక పరుగుల జాబితాలో సచినే టాప్లో ఉన్నా.. మాస్టర్తో ద్రవిడ్కు వ్యత్యాసం చాలా ఉన్నా.. అభిమానులు ది వాల్నే గొప్పటెస్ట్ బ్యాట్స్మన్ భావిస్తున్నారు.