టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ అండగా నిలిచాడు. జట్టు కోసం దూకుడుగా ఆడే ప్రయత్నంలోనే ఔటవుతున్నాడని తెలిపాడు. అత్యుత్తమ క్రికెట్ ఆడే సమయంలో కొన్నిసార్లు సానుకూల ఫలితాలు రావని, అలాంటి సమయంలో విఫలమైనట్లు భావించవద్దని అభిమానులు, క్రికెట్ విశ్లేషకులకు రాహుల్ ద్రవిడ్ సూచించాడు.
టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా ఇంగ్లండ్తో గురువారం జరిగిన సెమీఫైనల్-2లో టీమిండియా 68 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్కు దూసుకెళ్లింది. ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ(9) ఓ భారీ సిక్సర్ బాది అదే జోరులో ఔటయ్యాడు. ఈ టోర్నీ ఇప్పటి వరకు అతను చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఒక్కటి ఆడలేదు. 7 మ్యాచ్ల్లో 5 సార్లు సింగిల్ డిజిట్ స్కోర్కే పరిమితమయ్యాడు.

జట్టు కోసం దూకుడుగా ఆడే ప్రయత్నంలో అతను ఔటవుతున్నాడు. టీమ్మేనేజ్మెంట్ ఇచ్చిన రోల్ను అతను సమర్థవంతంగా పోషిస్తున్నాడు. ఇంగ్లండ్తో మ్యాచ్లోనూ కోహ్లీ ఓ అద్భుతమైన సిక్స్ బాదాడు. అదే దూకుడును కొనసాగించబోయి ఔటయ్యాడు. కోహ్లీ ఆట తీరును ప్రశ్నించాల్సిన అవసరం లేదు. కోహ్లీ ప్రవర్తన, దూకుడు అద్భుతం. మున్ముందు అతను దుమ్మురేపుతాడు. గతంలో మాదిరి పరుగుల మోత మోగిస్తాడు.'అని రాహుల్ ద్రవిడ్ చెప్పుకొచ్చాడు.
నా కోసం కాదు జట్టు కోసం గెలవాలి..
తన కోసం టీ20 ప్రపంచకప్ గెలవాలని మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ చేసిన వ్యాఖ్యలపై రాహుల్ ద్రవిడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను ఇలాంటివి అస్సలు నమ్మనని చెప్పాడు. ఎప్పుడూ ఒకరి కోసం గెలవాలనుకోకూడదని, దేశం కోసం గెలవాలని సూచించాడు. 'ఫలానా వ్యక్తి కోసం గెలవండని కొందరు చెబుతూ ఉంటారు. ఇలాంటివి నేను అస్సలు నమ్మను.
ఎవరెస్ట్ ఎక్కేవారిని ఎందుకు ఎక్కాలని అనుకుంటున్నావు? అని అడిగితే.. అతను అతిపెద్ద శిఖరం కాబట్టి ఎక్కుదామనుకుంటున్నానని చెబుతాడు. అదే ప్రశ్నను క్రికెటర్లను అడిగితే.. ప్రపంచకప్ అత్యుత్త టోర్నీ కాబట్టి గెలవాలనుకుంటున్నానని సమాధానం ఇవ్వాలి. అంతేకానీ కొందరి కోసమో, ఒకరికి అంకితం ఇవ్వడానికో గెలవాలనుకోవద్దు.
మా జట్టు నుంచి అత్యుత్తమ ప్రదర్శన రావాలని మాత్రమే నేను కోరుకుంటాను. అంతేకానీ, నా కోసం కప్ గెలవాలనే దానికి నేను విరుద్ధం. అసలు దానిగురించే మాట్లాడాలనుకోను'అని రాహుల్ ద్రవిడ్ చెప్పుకొచ్చాడు. ఈ టోర్నీతో టీమిండియా హెడ్ కోచ్గా రాహుల్ ద్రవిడ్ పదవి కాలం ముగియనుంది. ఈ క్రమంలోనే ద్రవిడ్ కోసం ప్రపంచకప్ గెలవాలని టీమిండియా ఆటగాళ్లకు సెహ్వాగ్ సూచించాడు.