
న్యూఢిల్లీ: టీమిండియా హెడ్ కోచ్ పదవికి దిగ్గజ బ్యాట్స్మన్, నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ) డైరెక్టర్ రాహుల్ ద్రవిడ్ దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. టీ20 ప్రపంచకప్ అనంతరం.. ప్రస్తుత హెడ్ కోచ్ రవిశాస్త్రి పదవి బాధ్యతలు ముగియనున్న నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఇటీవల దరఖాస్తులను ఆహ్వానించిన విషయం తెలిసిందే.
హెడ్కోచ్ పదవితో పాటు, బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ కోచ్ పదవులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి ఉన్నవారు అక్టోబర్ 26లోగా అప్లికేషన్లు సమర్పించాలని స్పష్టం చేసింది.
అయితే టీమిండియా హెడ్ కోచ్ పదవికి దరఖాస్తు చేసుకోవాలని రాహుల్ ద్రవిడ్ను బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ, సెక్రటరీ జైషా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసిట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ముందుగా వీరి విన్నపానికి ససేమిరా అన్న ద్రవిడ్.. దాదా రిక్వెస్ట్కు తలగ్గాడని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. అప్లికేషన్కు చివరి రోజైన నేడు(మంగళవారం) దరఖాస్తు చేసుకున్నట్లు బోర్డు వర్గాలు తెలిపాయి. ఇక కోచ్ నియామక రేసులో రాహుల్ ద్రవిడ్ ఉండటంతో మిగతావారికి నిరాశే ఎదురుకానుంది. రాహుల్ ద్రవిడ్ టీమిండియా హెడ్ కోచ్గా బాధ్యతలు చేపట్టడం ఖాయమైపోయింది. వచ్చే ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరిగే టీ20 ప్రపంచకప్తో పాటు భారత్ వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్ వరకు ద్రవిడ్ పర్యవేక్షణలోనే టీమిండియా బరిలోకి దిగనుంది.
మరోవైపు దిగ్గజ బ్యాట్స్మన్ వీవీఎస్ లక్ష్మణ్ జాతీయ క్రికెట్ అకాడమీ బాధ్యతలు స్వీకరించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ద్రవిడ్ స్థానంలో లక్ష్మణ్ ఈ బాధ్యతలు చేపట్టాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. లక్ష్మణ్ సైతం ఈ బాధ్యతలు చేపట్టడానికి విముఖత చూపినట్లు వార్తలు వచ్చాయి.