
న్యూఢిల్లీ: ప్రస్తుతం టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ను ఓపెనర్గా పంపించినట్లే.. రోహిత్ శర్మను మహేంద్ర సింగ్ ధోనీ ప్రమోట్ చేశాడని మాజీ ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్ తెలిపాడు. రోహిత్ను ఓపెనర్గా పంపిస్తూ ధోనీ తీసుకున్న ఆ నిర్ణయం గొప్పదని అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో సూర్యను ఓపెనింగ్ పంపిస్తూ టీమ్మేనేజ్మెంట్ చేసి ప్రయోగం సక్సెస్ అయింది. తొలి రెండు మ్యాచ్ల్లో సూర్య విఫలమైనా.. మూడో టీ20లో చెలరేగాడు. విధ్వంసకర బ్యాటింగ్తో మ్యాచ్ను ఏకపక్షం చేశాడు. అయితే కెరీర్ ఆరంభంలో రోహిత్ సైతం సూర్యకుమార్లా మిడిలార్డర్లో ఆడేవాడు. 2013 చాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా రోహిత్ను ధోనీ ఓపెనర్గా బరిలోకి దించాడు. దాంతో అతను స్టార్ ఓపెనర్గా ఎదిగాడు.
సూపర్ ఫామ్లో ఉన్న దినేశ్ కార్తీక్ను కాదని ధోనీ ఈ నిర్ణయం తీసుకున్నాడని శ్రీధర్ గుర్తు చేసుకున్నాడు. తాజాగా ఓ క్రికెట్ వెబ్సైట్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సూర్య ఓపెనింగ్పై స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశాడు. '2013 చాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా రోహిత్ శర్మను ఓపెనర్గా ప్రమోట్ చేస్తూ ధోనీ కీలక నిర్ణయం తీసుకున్నాడు. ప్రాక్టీస్ గేమ్లో దినేశ్ కార్తీక్ అదరగొట్టినా.. అతను రోహిత్ను టాపార్డర్లో ఆడించాడు. మేనేజ్మెంట్ నిర్ణయాల్లో అతని నిర్ణయాలే కీలకమయ్యేవి. అయితే ధోనీ తీసుకున్న నిర్ణయం చాలా గొప్పది.'అని శ్రీధర్ చెప్పుకొచ్చాడు. ఇక ఆస్ట్రేలియాతో జరిగిన వామప్ మ్యాచ్లో దినేశ్ కార్తీక్(146 నాటౌట్) అజేయ సెంచరీతో చెలరేగాడు. అతను మిడిలార్డర్లో ఆడుతాడని అంతా భావించారు. కానీ ధోనీ మాత్రం రోహిత్కు అవకాశం ఇచ్చాడు.
ఇక సూర్యను జట్టులోకి తీసుకోవడంపై శ్రీధర్ సంతోషం వ్యక్తం చేశాడు. రెండేళ్ల క్రితమే సూర్యను జట్టులోకి తీసుకోవాలని భావించినా.. విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ల కారణంగా కుదరలేదన్నాడు. కోహ్లీ గైర్హాజరీలో శ్రేయస్ ఆడేవాడని, దాంతో సూర్యకు అవకాశం లేకుండా పోయిందన్నాడు. మొత్తానికి అతను జట్టులోకి రావడం సంతోషంగా ఉందని చెప్పాడు.
'రెండేళ్ల క్రితమే ఇంగ్లండ్తో సిరీస్లో సూర్యను జట్టులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశాం. అతను అద్భుత ప్రదర్శన కనబర్చడంతో ఈ నిర్ణయం తీసుకున్నాం. కానీ అవకాశం లేకుండా పోయింది. విరాట్ కోహ్లీ గైర్హాజరీలో నెంబర్ 3లో శ్రేయస్ అయ్యర్ ఆడాడు'అని శ్రీధర్ చెప్పుకొచ్చాడు.