రోహిత్ శర్మ అనంతరం మూడు ఫార్మాట్లలో టీమిండియా సారథ్య బాధ్యతలు చేపట్టేందుకు యువ ఓపెనర్ శుభ్మన్ గిల్ సరైనోడని మాజీ ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్ అన్నాడు. మూడు ఫార్మాట్లలో శుభ్మన్ గిల్ను వైస్ కెప్టెన్గా నియమించడాన్ని అతను సమర్థించాడు.
గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్గా బాధ్యతలు చేపట్టిన అనంతరం కెప్టెన్సీ విషయంలో పలు మార్పులు చేశారు. సారథ్య బాధ్యతల నుంచి హార్దిక్ పాండ్యాను తప్పించి.. టీ20 కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ను ఎంపిక చేశారు. అంతేకాకుండా మూడు ఫార్మాట్లలో శుభ్మన్ గిల్కు వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించి.. భవిష్యత్తు సారథిగా తీర్చిదిద్దుతామని తెలిపారు.

ఈ క్రమంలోనే గిల్ గురించి మాట్లాడిన ఆర్ శ్రీధర్.. 2027 వన్డే ప్రపంచకప్ అనంతరం టీమిండియాను నడిపిస్తాడని చెప్పాడు.
'శుభ్మన్ గిల్ ప్రస్తుతం సూపర్ ఫామ్లో ఉన్నాడు. భారత్ వర్సెస్ ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్లోనూ తన సామర్థ్యం ఏంటో చూపించాడు. శుభ్మన్ గిల్ ఆల్ ఫార్మాట్ ప్లేయర్. రోహిత్ శర్మ అనంతరం జట్టును నడిపించే సత్తా అతనికి ఉంది. 2027 వన్డే ప్రపంచకప్ తర్వాత అతను మూడు ఫార్మాట్లలో భారత జట్టు సారథిగా ఎంపికవుతాడు.'అని చెప్పుకొచ్చాడు.
2020-21లో ఆస్ట్రేలియాతో టెస్ట్ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన శుభ్మన్ గిల్.. ఫస్ట్ సిరీస్లోనే అద్భుత ప్రదర్శన కనబర్చాడు. అప్పటి నుంచి నిలకడగా రాణిస్తూనే ఉన్నాడు. ఇప్పటి వరకు 46 ఇన్నింగ్స్లు ఆడిన శుభ్మన్ గిల్ 35.52 సగటుతో 1492 రన్స్ చేశాడు. వన్డేల్లోనూ గతేడాది అసాధారణ ప్రదర్శన కనబర్చాడు. 46 ఇన్నింగ్స్ల్లో 2322 రన్స్ చేశాడు. ఇందులో 15 హాఫ్ సెంచరీలతో పాటు 6 శతకాలు ఉన్నాయి. 20 టీ20 మ్యాచ్ల్లో 30.42 సగటుతో 578 రన్స్ చేశాడు. ఇందులో ఓ శతకంతో పాటు మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.