
న్యూఢిల్లీ: టీమిండియా స్టార్ ఆల్రౌండర్, గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై ఆ జట్టు యువ స్పిన్నర్ సాయి కిషోర్ ప్రశంసల జల్లు కురిపించాడు. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ దిగ్గజ సారథి మహేంద్ర సింగ్ ధోనీలానే ఉంటుందని చెప్పాడు. హార్దిక్ కెప్టెన్సీ ధోనీ జూనియర్ వర్షన్లా ఉంటుందని కితాబిచ్చాడు. ఐపీఎల్ 2022 సీజన్లో కొత్తగా ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్ చాంపియన్గా నిలిచిన విషయం తెలిసింది.
ఏ మాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన గుజరాత్ సంచలన ప్రదర్శనతో వరుస విజయాలందుకుంది. లీగ్ దశలో టేబుల్ టాపర్గా నిలిచి క్వాలిఫయర్ 1, ఫైనల్లో రాజస్థాన్ రాయల్స్ను మట్టికరిపించి తొలి టైటిల్ను ముద్దాడింది.
ఈ సీజన్లో హార్ధిక్ పాండ్యా కెప్టెన్గానే కాకుండా ఆల్రౌండర్గాను అద్భుతంగా రాణించాడు. ఈ క్రమంలోనే తమ కెప్టెన్ గురించి సాయి కిషోర్ గొప్పగా చెప్పాడు. టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో హార్దిక్ను ఆకాశానికెత్తాడు. 'ధోనీ, హార్ధిక్ పాండ్యా మధ్య చాలా పోలికలు ఉన్నాయి. ధోనీ లాగే హార్దిక్ కూడా తన జట్టులో ఆటగాళ్లకు మద్దతుగా నిలిచి.. అత్యుత్తమ ప్రదర్శన చేసేలా కృషి చేస్తాడు. హార్దిక్ కూడా ధోనీ లాగా గొప్ప కెప్టెన్ అవుతాడు.

కాబట్టి హార్దిక్ని ధోని జూనియర్ వెర్షన్గా అభివర్ణిస్తాను. ఇది నాకు బెస్ట్ సీజన్. అయితే వచ్చే ఏడాది సీజన్లో మరింత మెరుగ్గా రాణించాలనుకుంటున్నా. నెట్స్లో ధోనికి బౌలింగ్ చేయడం, అతనితో మాట్లడటం నాకు ఎంతో ఆనుభూతిని కలిగించింది. అదే విధంగా ధోనీ నుంచి నేను చాలా స్కిల్స్ నేర్చుకున్నాను" అని సాయి కిషోర్ చెప్పుకొచ్చాడు.
కాగా ఐపీఎల్-2020 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు సాయి కిషోర్ ప్రాతినిథ్యం వహించాడు. ఇక ఐపీఎల్-2022 మెగా వేలంలో అతన్ని గుజరాత్ టైటాన్స్ కొనుగోలు చేసింది. ఈ సీజన్లో కిషోర్ పర్వాలేదనిపించాడు. 5 మ్యాచ్లు ఆడిన కిషోర్ 6 వికెట్లు పడగొట్టాడు.