టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆకస్మిక రిటైర్మెంట్ అనేక సందేహాలకు తావిస్తోంది. అవకాశాలు ఇవ్వకపోవడంతోనే బాగా హర్ట్ అయిన అశ్విన్ సడెన్గా రిటైర్మెంట్ ప్రకటించినట్లు జోరుగా చర్చ జరుగుతోంది. అంతేకాకుండా అశ్విన్ రిటైర్మెంట్తో టీమిండియాలో విభేదాలు ఉన్నాయనే విషయం స్పష్టమవుతోంది.
ఆస్ట్రేలియాతో ఐదు టెస్ట్ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ అనంతరం మరికొంతమంది సీనియర్ ఆటగాళ్లు అశ్విన్ బాటలోనే నడుస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఐదు టెస్ట్ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఇప్పటి వరకు జరిగిన మూడు టెస్ట్ల్లో అశ్విన్కు ఒక్క మ్యాచ్లోనే చోటు దక్కింది.

పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్ట్లో అశ్విన్కు బదులు వాషింగ్టన్ సుందర్ను ఆడించారు. ఈ నిర్ణయం అశ్విన్ను బాగా హర్ట్ చేసిందని, ఆ మ్యాచ్ ముగిసిన వెంటనే రిటైర్మెంట్ ప్రకటించాలనే నిర్ణయానికి వచ్చినట్లు అర్థమవుతోంది. కెప్టెన్ రోహిత్ శర్మ సైతం ఇదే విషయాన్ని వెల్లడించాడు. తాను కన్విన్స్ చేయడంతోనే అశ్విన్ పింక్ బాల్ టెస్ట్ ఆడాడని చెప్పాడు.
ఈ క్రమంలోనే టీమిండియాలో విభేదాలు ఉన్నాయనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా టీమిండియా మేనేజ్మెంట్ తీసుకునే నిర్ణయాలు జట్టులోని కొందరు ఆటగాళ్లకు నచ్చడం లేదనే విషయం అర్థమవుతోంది. తొలి రెండు టెస్ట్ల్లో జడేజాకు అవకాశం దక్కలేదు. మూడో టెస్ట్లో చోటివ్వగా అతను బౌలింగ్లో విఫలమైనా బ్యాటింగ్లో సత్తా చాటి భారత్కు ఓటమి తప్పించాడు.
అయితే తమకు కావాల్సిన ఆటగాళ్లకే తుది జట్టులో అవకాశం ఇస్తున్నారనే వాదన కూడా వినిపిస్తోంది. విదేశాల్లో శుభ్మన్ గిల్ విఫలమవుతున్నా.. అతనికి తుది జట్టులో వరుసగా అవకాశాలు ఇవ్వడం ఈ వాదనకు బలం చేకూర్చుతోంది. మరోవైపు టెస్ట్ క్రికెట్ మాత్రమే ఆడుతున్న సర్ఫరాజ్ ఖాన్కు అవకాశం ఇవ్వడం లేదు.
గంభీర్, రోహిత్ శర్మ తీసుకునే నిర్ణయాలతో విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా ఏకీభవించడం లేదనే ప్రచారం కూడా జరుగుతోంది. తొలి టెస్ట్లో బుమ్రా అద్భుత కెప్టెన్సీతో పాటు అసాధారణ బౌలింగ్తో చారిత్రాత్మక విజయాన్నందించాడు. కానీ రెండో టెస్ట్కు రోహిత్ అందుబాటులోకి రావడంతో బుమ్రా వైస్ కెప్టెన్గా కొనసాగుతున్నాడు. ఇది కూడా బుమ్రాకు ఇబ్బంది కలిగిస్తున్నట్లు తెలుస్తోంది.
అశ్విన్ రిటైర్మెంట్.. భారత జట్టులోని విభేదాలు, లోపాలు, అనైక్యతను బయటపెట్టింది. సీనియర్ ఆటగాళ్లు ఒకరి తర్వాత ఒకరు తప్పుకుంటారనే వాదన బలంగా వినిపిస్తోంది.