
అలాంటి ఆలోచనలు వద్దు..
చాలా మంది ఇది క్రీడాస్పూర్తికి విరుద్దమనే ఆలోచనలో ఉన్నారని, దాంతోనే ఈ తరహా రనౌట్ చేసేందుకు వెనుకడుగు వేస్తున్నారని చెప్పాడు. అయితే నాన్ స్ట్రైకర్ బంతి వేయకుండా ఒక అడుగు బయట వేసి ప్రయోజం తీసుకుంటే అతన్ని రనౌట్ చేసేయాలన్నాడు. 'ఈ రూల్ బౌలర్లను కించపరిచింది. ఇప్పుడు రనౌట్ చేయమని చెబుతున్నారు. అయితే అలా నాన్ స్ట్రైకర్ను రనౌట్ చేస్తే వారు బాధపడతారేమోనని బౌలర్లు ఆలోచిస్తున్నారు. ఈ ప్రపంచం వారి దోషులుగా చూస్తుందేమోనని ఆందోళన చెందుతున్నారు. అందుకే ఇలా రనౌట్ చేయడానికి వెనకడుగు వేస్తున్నారు. అయితే బౌలర్లందరీకి నేను మరోసారి చెప్పాలనుకుంటున్నా.

రనౌట్ చేసేయ్యండి
..
నాన్ స్ట్రైకర్ బంతి వేయకుండా ఒక అడుగు బయటకు వేస్తే అది మీ కెరీర్లనే నాశనం చేయవచ్చు. స్ట్రైకింగ్లో ఉన్న బ్యాట్స్మన్ సిక్స్ కొట్టవచ్చు. అదే రనౌట్ చేస్తే మీ కెరీర్ మలుపు తిరగవచ్చు. ఆ బాల్ సిక్స్ వెళ్తే నిన్ను తదుపరి మ్యాచ్లో నుంచి వేటు వేయవచ్చు. అది నీ కెరీర్పై ప్రభావం చూపించవచ్చు. అందుకే బౌలర్లందరీని కోరేది ఒక్కటే.. దీని గురించి ఎక్కువగా ఆలోచించకుండా మీకు అనుకూలంగా మార్చుకోండి'అని అశ్విన్ పేర్కొన్నాడు.

జోస్ బట్లర్ను మన్కడింగ్ చేయడంతో..
ఐపీఎల్ 2019 సీజన్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్గా ఉన్న రవిచంద్రన్ అశ్విన్.. రాజస్థాన్ రాయల్స్కు చెందిన జోస్ బట్లర్ను ఓ లీగ్ మ్యాచ్లో మన్కడింగ్ చేశాడు. అశ్విన్ బౌలింగ్ చేస్తుండగా.. నాన్ స్ట్రైకింగ్ ఎండ్లో ఉన్న జోస్ బట్లర్ క్రీజు దాటి ముందుకు రావడంతో అతడిని ఔట్ చేశాడు. ఈ ఘటనపై అప్పట్లో తీవ్ర దుమారం రేగింది. అశ్విన్ చేసిన పని అనైతికం అంటూ అభిమానులు, మాజీ క్రికెటర్లు విమర్శలు గుప్పించారు. అయితే, అశ్విన్ ఎప్పటికప్పుడూ తన నిర్ణయాన్ని సమర్ధించుకుంటూ వచ్చాడు. తను చేసిన దాంట్లో తప్పేం లేదని పలు సందర్భాల్లో వ్యాఖ్యానించాడు.

సర్వత్రా విమర్శల నేపథ్యంలో..
అప్పటి నుంచి ఈ ఔట్పై తీవ్ర చర్చ జరుగుతూ వచ్చింది. నిబంధనల్లో ఉన్నదే అశ్విన్ చేశాడని భారత ఆటగాళ్లు మద్దతు తెలపగా.. క్రీడా స్పూర్తికి విరుద్దమని ఇతరులు వాదించారు. అంతేకాకుండా మన్కడింగ్ అనే పేరును మార్చాలని, ఇది భారత దిగ్గజ ప్లేయర్ వినూ మన్కడ్ను అవమానపరచడమేనని సునీల్ గవాస్కర్ వంటి దిగ్గజాలు డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే ఈ నిబంధనపై రివ్యూ చేసిన ఎంసీసీ.. తాజాగా రనౌట్ జాబితాలోకి చేర్చింది. ఇటీవల ముగిసిన ఐపీఎల్ మెగా వేలంలో అశ్విన్ను రాజస్థాన్ రాయల్స్ జట్టు రూ.5 కోట్లకు దక్కించుకున్న విషయం తెలిసిందే. దీంతో మార్చి 26 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ - 2022 సీజన్లో అశ్విన్, జోస్ బట్లర్ ఒకే జట్టు తరఫున ఆడనున్నారు.


Click it and Unblock the Notifications












