టీమిండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ సోషల్ మీడియా వేదికగా చురుకుగా ఉంటాడు. క్రికెట్తో పాటు దేశవ్యాప్తంగా జరిగే సంఘటనలపై తనదైన శైలిలో అశ్విన్ స్పందిస్తుంటాడు. తాజాగా బాలీవుడ్ బ్యూటీ సన్నీ లియోన్ ఫొటోను తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. సన్నీ లియోన్తో పాటు చెన్నై వీధి చిత్రంతో కలిపి పోస్ట్ పెట్టాడు. ఈ పోస్ట్ నెట్టింట తీవ్ర చర్చనీయాంశమైంది.
తమిళనాడు యువ క్రికెటర్ సన్నీ సంధుకు తనదైన శైలిలో అభినందనలు చెప్పేందుకు అశ్విన్ ఇలా చేశాడని తెలుస్తోంది. ప్రతిష్టాత్మక దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో సౌరాష్ట్రపై తమిళనాడు విజయం సాధించింది. ఈ మ్యాచ్లో సన్నీ సంధు 9 బంతుల్లో 30 పరుగులు చేసి సాయి సుదర్శన్తో కలిసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

అతని పేరు అర్థం వచ్చేలా సన్నీ లియోన్తో పాటు సంధు(గల్లీ) ఫొటోను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. ఐపీఎల్ 2026 మినీ వేలానికి సన్నీ సంధు ఇప్పటికే రిజిస్టర్ చేసుకున్నాడు. అశ్విన్ తాజా పోస్ట్తో ఈ తమిళ ఆల్రౌండర్ పేరు సర్వత్రా చర్చనీయాంశమైంది. అశ్విన్ తాజా పోస్ట్తో సన్నీ సంధుకు డిమాండ్ పెరుగుతుందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
డిసెంబర్ 8న జరిగిన మ్యాచ్లో సౌరాష్ట్రపై తమిళనాడు 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన సౌరాష్ట్ర నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 183 పరుగులు చేసింది. అనంతరం తమిళనాడు 18.4 ఓవర్లలో 7 వికెట్లకు 185 పరుగులు చేసి గెలుపొందింది. సాయి సుదర్శన్(55 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్స్లతో 101 నాటౌట్) అజేయ శతకంతో చెలరేగగా.. సన్నీ సంధు(9 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 30) దూకుడుగా ఆడాడు. డిసెంబర్ 16న అబిదాబి వేదికగా ఐపీఎల్ 2026 మినీ వేలం జరగనుంది. రూ.30 లక్షల కనీస ధరతో అన్క్యాప్డ్ లిస్ట్లో సన్నీ సంధు ఉన్నాడు.