టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సెంచరీతో చెలరేగాడు. బంగ్లాదేశ్తో రెండు టెస్ట్ల సిరీస్లో భాగంగా గురువారం చెన్నై వేదికగా ప్రారంభమైన తొలి మ్యాచ్లో లోకల్ భాయ్ అశ్విన్ శతకంతో టీమిండియాను ఆదుకున్నాడు. 144 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న జట్టును రవీంద్ర జడేజాతో కలిసి అశ్విన్ గట్టెక్కించాడు. ఈ క్రమంలో 108 బంతుల్లో అశ్విన్ సెంచరీ సాధించాడు.
అశ్విన్కు ఇది 6వ టెస్ట్ సెంచరీ. చెపాక్ మైదానంలో వరుసగా రెండో టెస్ట్ శతకం. మరోవైపు రవీంద్ర జడేజా.. అశ్విన్కు అండగా నిలించాడు. వన్డే తరహా బ్యాటింగ్తో బౌండరీలు బాదుతూ బంగ్లాదేశ్ బౌలర్లపై విరుచుకుపడ్డ ఈ జోడీ.. భారత్ను గట్టెక్కించింది. ఏడో వికెట్కు అజేయంగా 195 పరుగులు జోడించారు.

టాప్-3 అట్టర్ ఫ్లాప్
ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. బంగ్లాదేశ్ యువ పేసర్ హసన్ మహముద్ నిప్పులు చెరగడంతో తొలి 10 ఓవర్లలోనే రోహిత్ శర్మ(6), శుభ్మన్ గిల్(0), విరాట్ కోహ్లీ(6)ల వికెట్లు కోల్పోయింది. 34 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును యశస్వి జైస్వాల్, రిషభ్ పంత్ ఆదుకున్నారు. ఆచితూచి బ్యాటింగ్ చేసిన ఈ జోడీ తొలి సెషన్ను 88/3తో ముగించింది.
లంచ్ బ్రేక్ అనంతరం రిషభ్ పంత్(39) ఔటవ్వగా.. యశస్వి జైస్వాల్ 95 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కేఎల్ రాహుల్తో కలిసి పోరాడుతున్న అతన్ని నహిద్ రాణా క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు. ఆ మరుసటి ఓవర్లోనే కేఎల్ రాహుల్(16)ను హసన్ మీరాజ్ ఔట్ చేయడంతో 114 పరుగులకే భారత్ 6 వికెట్లు కోల్పోయింది. దాంతో టీమిండియా ఆలౌట్ అవుతుందని అంతా అనుకున్నారు.
ఆదుకున్న లోకల్ భాయ్..
కానీ ఈ పరిస్థితుల్లో బ్యాటింగ్కు వచ్చిన లోకల్ భాయ్ అశ్విన్ అటాకింగ్ బ్యాట్తో బంగ్లా బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. మరోవైపు జడేజా కూడా బ్యాట్కు పనిచెప్పడంతో బంగ్లా బౌలర్లు ఒత్తిడికి గురయ్యారు. క్విక్ సింగిల్స్తో పాటు వీలు చిక్కిన బంతిని ఈ జోడీ బౌండరీకి తరలించింది. దాంతో భారత్ 228/6 స్కోర్తో టీ బ్రేక్కు వెళ్లింది.
మూడో సెషన్లో భారత బ్యాటర్లు మరింత దూకుడుగా ఆడారు. అశ్విన్ 58 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. జడేజా 73 బంతుల్లో అర్థ సెంచరీ సాధించాడు. అనంతరం ఇదే సమన్వయంతో బ్యాటింగ్ చేసిన ఈ జోడీ వేగంగా పరుగులు రాబట్టింది. అశ్విన్ సెంచరీ పూర్తి చేసుకున్న కాసేపటికే అంపైర్లు తొలి రోజు ఆట ముగిసినట్లు ప్రకటించారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్లో 80 ఓవర్లలో 6 వికెట్లకు 339 పరుగులు చేసింది.