న్యూఢిల్లీ: టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్పై వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రశంసల జల్లు కురిపించాడు. కేఎల్ రాహుల్ రాకతో టీమిండియా మిడిలార్డర్ సమస్య తీరిందన్నాడు.అతని కారణంగా జట్టు బ్యాటింగ్లో నిలకడ పెరిగిందన్నాడు. ఐపీఎల్ 2023 సీజన్ సందర్భంగా తొడ కండరాల గాయానికి గురైన రాహుల్.. సుమారు 5 నెలల తర్వాత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు.
పాకిస్థాన్తో సూపర్ మ్యాచ్తో పునరాగమనం చేసిన రాహుల్.. తొలి మ్యాచ్లోనే శతకంతో చెలరేగాడు. శ్రీలంకతో జరిగిన మ్యాచ్లోనూ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. వికెట్ కీపర్గానూ రాణిస్తూ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని గుర్తు చేశాడు. ఒకప్పటి ధోనీలా బౌలర్లకు సలహాలు ఇస్తూ.. రివ్యూల విషయంలో కెప్టెన్ రోహిత్ శర్మకు అండగా ఉంటున్నాడు. విమర్శకులకు తన ఆటతోనే సమాధానం చెప్పాడు.

తాజాగా ఓ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాహుల్ గురించి మాట్లాడిన అశ్విన్.. ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. 'కేఎల్ రాహుల్ రాకతో టీమిండియా మిడిలార్డర్కు నిలకడ వచ్చింది. మిడిలార్డర్లో బ్యాటింగ్ చేయడం చాలా కష్టం. గతంలో ధోనీ తనదైన బ్యాటింగ్తో సత్తా చాటేవాడు. ఇప్పుడు కేఎల్ రాహుల్ అంతే సౌకర్యవంతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. రాహుల్ను ధోనీతో పోల్చడం లేదు. ధోనీ ఫినిషర్గా బరిలోకి దిగేవాడు. 6, ఏడో స్థానంలో బ్యాటింగ్ చేసేవాడు.
రాహుల్ నెమ్మదిగా ధోనీని తలపిస్తున్నాడు. శ్రీలంకతో ఇషాన్ కిషన్తో కలిసి అతను నెలకొల్పిన భాగస్వామ్యం అద్బుతం. టాపార్డర్ బ్యాటర్లను ఇబ్బంది పెట్టిన దునిత్ వెల్లలాగే అద్భుత బౌలింగ్ను కూడా సమర్థవంతంగా ఆడాడు.'అని అశ్విన్ చెప్పుకొచ్చాడు.
టీమిండియాకు తన సేవలు అవసరమనుకుంటే ఆడేందుకు సిద్ధంగా ఉన్నానని అశ్విన్ తెలిపాడు. 'గత 14-15 సంవత్సరాలుగా టీమిండియా తరఫున ఆడుతున్నా. నా కెరీర్లో ఎన్నో గొప్ప క్షణాలున్నాయి. అలాగే వైఫల్యాలు కూడా ఉన్నాయి. విజయాలు, వైఫల్యాలు సమానంగా ఉన్నాయి.
కానీ, ఇండియన్ క్రికెట్ అని నా హృదయానికి దగ్గరగా టాటూ వేయించుకున్నాను. వారికి నా సేవలు రేపటి నుంచే అవసరమైనా అందుకు సిద్ధంగా ఉన్నా. నా వంద శాతం ప్రదర్శన చేస్తా'' అని అశ్విన్ పేర్కొన్నాడు.