
చెన్నై: పిచ్పై బంతి తిరగడం కన్నా ఇంగ్లండ్ బ్యాట్స్మెన్ అభద్రతా భావం వల్లే సెకండ్ టెస్ట్లో ఆధిపత్యం చెలాయించామని టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. వేగం, వ్యూహం వల్లే పిచ్ను మరింత బాగా ఉపయోగించుకోగలిగామని తెలిపాడు. మంగళవారం ముగిసిన ఈ మ్యాచ్లో అశ్విన్ ఆల్రౌండ్షో కనబర్చిన విషయం తెలిసిందే. సెంచరీతో పాటు 8 వికెట్లు తీసి ఇంగ్లండ్ పతనాన్ని శాసించాడు. దాంతో భారత్ 317 పరగుల భారీ విజయాన్నందుకొని సిరీస్ను 1-1తో సమం చేసింది. ఇక మ్యాచ్ అనంతరం మాట్లాడిన అశ్విన్.. పిచ్పై వస్తున్న విమర్శలను ఖండించాడు.
'బయటవాళ్లు అనుకుంటున్నట్లుగా అతిగా తిరుగుతున్న బంతులతో వికెట్లేమీ పడలేదు. బ్యాట్స్మెన్ అభద్రతా భావం వల్లే మాకు వికెట్లు దక్కాయి. నేనిక్కడ ఏళ్ల తరబడి ఆడుతున్నా. ఈ పిచ్పై వ్యూహం ప్రకారం మంచి వేగంతో బంతులు వేయాలి. తీవ్రత ముఖ్యం. నేను పరిస్థితులు, చల్లగాలి, విభిన్న కోణాల్లో బంతిని వేయడం, రన్నప్లో వేగం వంటివి ఉపయోగించి బౌలింగ్ చేస్తాను. ఇక్కడ ఇవి పనిచేస్తాయని నాకు అవగాహన ఉంది' అని అశ్విన్ తెలిపాడు.
తొలి మ్యాచ్లో ఆడిన వికెట్తో పోలిస్తే ఇప్పటి వికెట్ భిన్నంగా ఉందన్నాడు. ఇది ఎర్రమట్టితో రూపొందించిన పిచ్ అని చెప్పుకొచ్చాడు. ఇక పిచ్ విషయంలో భారత జట్టు గగ్గోలు పెట్టిన దాఖలాలు లేవన్నాడు. తమ దిగ్గజాలు రవిశాస్త్రి, గవాస్కర్ ఎన్నో విదేశీ పర్యటనలకు వెళ్లిన ఏనాడు పిచ్లపై ఫిర్యాదు చేయలేదన్నాడు. పిచ్ విషయంలో వస్తున్న విమర్శలను భారత క్రికెట్ వర్గాలు తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని అశ్విన్ అభిప్రాయపడ్డాడు.
ప్రత్యర్థి బౌలర్లపై ఒతిడి పెంచాలనే లక్ష్యంతో బ్యాటింగ్ చేశానని ఈ తమిళనాడు క్రికెటర్ చెప్పుకొచ్చాడు. 'ప్రత్యర్థి బౌలర్లపై ఒత్తిడి పెంచడం కీలకం. వారు మమ్మల్ని నియంత్రించేలా అవకాశమిస్తే కష్టం. అందుకే నేను బాగా బ్యాటింగ్ చేయాలని అనుకున్నాను. తొలి బంతి ఆడాక వికెట్పై నిలబడొచ్చని తెలిసింది. పరిస్థితులు నాకు అనుకూలంగా లేనప్పుడు నేను చాలా చాలా కష్టపడతాను. బ్యాటింగ్ చేసేందుకు విక్రమ్ రాథోడ్ సాయపడ్డారు. నా ఆటంతా చేతుల్లోనే ఉంటుంది. అందుకే సాంకేతికంగా కాకుండా వ్యూహాత్మకంగా ఆడతాను. అజింక్యా నా బ్యాటింగ్లో కీలక పాత్ర పోషించాడు. నేను అతిగా ఆలోచిస్తున్నానని సూచించాడు. సిడ్నీలో ఆడిన ఇన్నింగ్స్తో లయ అందుకున్నాను' అని అశ్విన్ చెప్పుకొచ్చాడు.