ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా దారుణంగా విఫలమైంది. ఐదు టెస్ట్ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని 1-3తో కోల్పోయింది. పేలవ బ్యాటింగ్ టీమిండియా విజయవకాశాలను దెబ్బతీసింది. ఈ పరాజయంతో టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ చేరే అవకాశాన్ని కోల్పోయింది. అయితే టీమిండియా ఓటమికి ఆస్ట్రేలియా పేసర్ స్కాట్ బోలాండ్ కారణమని మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు.
స్కాట్ బోలాండ్ జట్టులోకి రావడం ఆస్ట్రేలియా అదృష్టమని తెలిపాడు. 'సిడ్నీ వేదికగా జరిగిన ఆఖరి టెస్ట్ వరకు టీమిండియాకు సిరీస్ నిలబెట్టుకునే అవకాశం లభించింది. భారత్ కూడా ఆఖరి రోజు వరకు పోరాడింది. కానీ అద్భుతంగా ఆడిన ఆస్ట్రేలియా సిరీస్ను కైవసం చేసుకుంది. ప్యాట్ కమిన్స్ లెఫ్టార్మ్ బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు. కానీ స్కాట్ బోలాండ్ భారత్ పతనాన్ని శాసించాడు.

అతను జట్టులోకి రావడం ఆసీస్ అదృష్టమే. బోలాండ్ ఈ సిరీస్ ఆడకపోయి ఉంటే భారత్ విజేతగా నిలిచేది. జోష్ హజెల్ వుడ్ బెస్ట్ బౌలర్ అయినప్పటికీ అతను జట్టులో కొనసాగి ఉంటే టీమిండియా గెలిచేది. లెఫ్టాండర్లకు బోలాండ్ వేసిన రౌండ్ ది వికెట్ డెలివరీలు తీవ్ర ప్రభావం చూపాయి.
ఈ సిరీస్ సిడ్నీ టెస్ట్ ఆఖరి సెషన్ వరకు ఉత్కంఠగా సాగింది. ఇదో గొప్ప సిరీస్. స్వచ్చమైన క్రికెట్. క్లాస్ సిరీస్. ఇరు జట్లు అసాధారణ ప్రదర్శన కనబర్చాయి. చివరి రోజు వరకు ఆస్ట్రేలియా గట్టి పోటీని ఎదుర్కొని విజేతగా నిలిచింది. ఈ సిరీస్ విజయానంతరం ఉస్మాన్ ఖవాజా మాట్లాడుతూ.. బుమ్రా వణికించాడని చెప్పాడంటేనే ఈ సిరీస్ ఎంత పోటాపోటీగా సాగిందో అర్థం చేసుకోవచ్చు.'అని అశ్విన్ తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా చెప్పుకొచ్చాడు.
జోష్ హజెల్ వుడ్ గాయపడటంతో స్కాట్ బోలాండ్ జట్టులోకి వచ్చాడు. అతను మూడు టెస్ట్ల్లో 21 వికెట్లు పడగొట్టి ఆసీస్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. సిడ్నీ వేదకిగా జరిగిన ఆఖరి టెస్ట్లో 10 వికెట్లు పడగొట్టాడు. ఈ సిరీస్లో జస్ప్రీత్ బుమ్రా(32), ప్యాట్ కమిన్స్(26) తర్వాత అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలిచాడు.
10 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఆసీస్.. ఐదు టెస్ట్ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని తిరిగి సొంతం చేసుకుంది. ఈ పర్యటన మధ్యలోనే అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. పింక్ బాట్ టెస్ట్లో ఆడిన అశ్విన్ పెద్దగా ప్రభావం చూపలేదు. ఆ వెంటనే రిటైర్మెంట్ ప్రకటించి స్వదేశానికి వచ్చేసాడు.