న్యూజిలాండ్తో మూడు టెస్ట్ల సిరీస్లో టీమిండియా క్లీన్ స్వీప్ అవ్వడానికి తానే ప్రధాన కారణమని వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. సీనియర్ ఆటగాడిగా బౌలింగ్, బ్యాటింగ్లో తాను ఆశించిన స్థాయిలో రాణించలేకపోయానని చెప్పాడు. ఈ ఘోర పరాజయం తనను తీవ్రంగా కుంగదీసిందన్నాడు.
ఇటీవలే ముగిసిన ఈ సిరీస్లో టీమిండియా 0-3తో క్లీన్ స్వీప్ అయ్యింది. బెంగళూరు టెస్ట్తో పాటు పుణే, ముంబై టెస్ట్ల్లో చిత్తుగా ఓడింది. 12 ఏళ్ల తర్వాత సొంతడ్డపై టెస్ట్ సిరీస్ను కోల్పోయిన భారత్.. 92 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలిసారిగా సొంతగడ్డపై వైట్వాష్కు గురైంది.

ఓటమిని తట్టుకోలేకపోయాం..
ఈ ఘోర పరాజయంపై రవిచంద్రన్ అశ్విన్ తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా మాట్లాడాడు. ఈ ఓటమిని ఏ మాత్రం జీర్ణించుకోలేకపోయామని చెప్పాడు. ఈ పరాజయం నేపథ్యంలో భారత ఆటగాళ్లపై వస్తున్న విమర్శలను అశ్విన్ తప్పుబట్టాడు. క్రీడల్లో గెలుపు ఓటములు సహజమన్నాడు. ఆటగాళ్లను నిందిస్తూ వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదన్నాడు.
'న్యూజిలాండ్ చేతిలో క్లీన్ స్వీప్ అవ్వడం తీవ్ర బాధను కలిగించింది. ఈ ఓటమి నుంచి తేరుకునేందుకు రెండు, మూడు రోజుల సమయం పట్టింది. నా కెరీర్లో చాలా ఓటములను ఎదుర్కొన్నా. కానీ ఇది జీవితంలో అత్యంత ఘోరమైన వైఫల్యంగా భావిస్తున్నాను.
నా వల్లే ఈ ఓటమి..
ఈ వైఫల్యానికి నేనే ప్రధాన కారణం. లోయరార్డ్లో జట్టుకు కావాల్సిన పరుగులు చేయలేకపోయాను. కొన్ని ఇన్నింగ్స్ల్లో బాగానే ఆడినా.. తర్వాతి ఇన్నింగ్స్ల్లో దారుణంగా విఫలమయ్యాను. న్యూజిలాండ్ జట్టు అసాధారణమైన ప్రదర్శన కనబర్చింది. ఆ జట్టు బ్యాటర్లు భారత బౌలింగ్ను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు.
భారత జట్టుకు పుంజుకునే అవకాశం ఇవ్వలేదు. నేను అదనంగా 20 నుంచి 30 శాతం సహకారం అందించాల్సింది. కానీ, బ్యాటింగ్, బౌలింగ్లో తడబడ్డాను. టెస్ట్ క్రికెట్లో టెయిలెండర్స్ చేసేపరుగులు బంగారంతో సమానం. ఈ టెస్ట్ సిరీస్లో మా లోయరార్డర్ విఫలమైంది.
విమర్శలు సరికాదు..
ఈ ఘోర పరాజయం తర్వాత భారత ఆటగాళ్లపై తీవ్ర విమర్శలు వచ్చాయి. భారత జట్టులోని ఆటగాళ్లంతా అభిమానులకు క్షమాపణలు చెప్పాల్సిందేనంటూ ఘాటుగా విమర్శించారు. అయితే ఇది ఒక ఆట అని విమర్శలు చేసేవారు గుర్తు చేసుకోవాలి. ఈ ఓటమికి అభిమానులతో పాటు ఆటగాళ్లు కూడా బాధపడ్డారు.
డ్రెస్సింగ్ రూమ్లో ఆటగాళ్లు బాధపడినట్లు మరేవరూ అంతలా బాధపడరు. ప్రతీ క్రికెటర్ కెరీర్ వారు మైదానంలో చేసే పనులపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఎవరూ కూడా వ్యక్తిత్వ హననం చేయకూడదు.'అని అశ్విన్ చెప్పుకొచ్చాడు.