
న్యూఢిల్లీ: టీమిండియా టీ20 కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రశంసల జల్లు కురిపించాడు. హార్దిక్ చాలా తెలివైన క్రికెటరని, చాలా కూల్గా ఉంటూ జట్టు వాతావారణాన్ని ప్రశాంతంగా ఉంచుతాడని చెప్పాడు. అతనిలో తనకు నచ్చేది ఇదేనని తెలిపాడు.
ప్రస్తుతం శ్రీలంకతో జరుగుతున్న మూడు టీ20 మ్యాచ్ల సిరీస్లో టీమిండియాను హార్దిక్ పాండ్యా నడిపిస్తున్న విషయం తెలిసిందే. హార్దిక్ కెప్టెన్సీకి అభిమానులు ఫిదా అవుతున్నారు. పాండ్యా ఇప్పటివరకు ఏడు టీ20ల్లో భారత్కు నాయకత్వం వహించగా.. శుక్రవారం శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో మాత్రమే ఓటమిపాలైంది. అంతకుముందు న్యూజిలాండ్తో ఒక మ్యాచ్ టై అయింది.
ఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్య కెప్టెన్సీ సామర్థ్యంపై టీమింయా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడాడు. హార్దిక్ చాలా కూల్గా ఉంటాడని, జట్టును రిలాక్స్గా ఉంచుతాడని చెప్పాడు. 'హార్దిక్ చాలా తెలివైన క్రికెటర్. అతనిలో నాకు నచ్చిన విషయం ఏమిటంటే.. చాలా కూల్గా, రిలాక్స్గా ఉంటాడు. కాబట్టి.. ఇది జట్టు వాతావరణాన్ని చాలా ప్రశాంతంగా ఉంచుతుంది. ఇలా ఉంటే ఆటగాళ్లు కలిసి కట్టుగా బాగా రాణిస్తారని భావిస్తున్నా' అని అశ్విన్ చెప్పాడు.
శ్రీలంకతో రెండో టీ20లో భారత్ ఓటమి తర్వాత హార్దిక్ కెప్టెన్సీ గురించి టీమ్ఇండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ మాట్లాడాడు. ప్రతి మ్యాచ్ తర్వాత ఆటగాడిని అంచనా వేయకూడదని గంభీర్ అన్నాడు. 'హార్దిక్ మంచి ఆటగాడు. ప్రతి మ్యాచ్ తర్వాత ఆటగాళ్ల గురించి అంచనా వేయకూడదు. మ్యాచ్లో భారత్ ఓడిపోయింది. అయినంత మాత్రాన.. అతడు విఫలమయ్యాడని భావించకూడదు. నో బాల్స్ వేయకుండా బౌలర్లను నియంత్రించలేకపోయాడు. అలా చేయకుండా ఉండటం బౌలర్ల బాధ్యత. ఇప్పటివరకు అతడు కెప్టెన్గా సక్సెస్ అయ్యాడని భావిస్తున్నా. చాలా రిలాక్స్గా ఉండి తన ఆటగాళ్లకు మద్దతు ఇస్తాడు' అని గంభీర్ పేర్కొన్నాడు.