టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ టెస్ట్ల్లో 500 వికెట్లు అందుకోవడంపై అతని సతీమణి ప్రీతి నారయణన్ ఆలస్యంగా స్పందించింది. ఇన్స్టాగ్రామ్ వేదికగా అశ్విన్ను కొనియాడిన ప్రీతి.. భావోద్వేగానికి గురైంది. ఐదు టెస్ట్ల సిరీస్లో భాగంగా రాజ్కోట్ వేదికగా జరిగిన మూడో టెస్ట్లో అశ్విన్ 500 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు.
అయితే అతని తల్లి అనారోగ్యానికి గురవడంతో మ్యాచ్ మధ్యలోనే ఇంటికి బయల్దేరాడు. రెండో రోజు ఆట అనంతరం చెన్నై వెళ్లిన అతను మూడో రోజు ఆట ఆడలేదు. మళ్లీ నాలుగో రోజు అంపైర్లు అనుమతితో బరిలోకి దిగాడు. కీలకమైన ఒక వికెట్ తీసి 501వ వికెట్ను ఖాతాలో చేసుకున్నాడు. అయితే ఈ 501వ వికెట్ వెనుక ఎంతో శ్రమ ఉందని ప్రీతి నారయణ్ తెలిపింది.

'హైదరాబాద్ టెస్ట్లోనే అశ్విన్ 500వ వికెట్ కోసం ప్రయత్నించాడు. కానీ అక్కడ సాధ్యం కాలేదు. వైజాగ్ టెస్టులో ప్రయత్నించినా జరగలేదు. దాంతో అప్పటికే కొని ఉంచిన స్వీట్లను మేం 499వ వికెట్ వద్దే ఇంటి దగ్గర అందరికీ పంచిపెట్టాము. రాజ్కోట్ టెస్ట్లో 500వ వికెట్ దక్కింది కానీ మేము సెలెబ్రేట్ చేసుకోకుండా మౌనంగా ఉండిపోయాం.
500 - 501 వికెట్ల మధ్య చాలా విషయాలు జరిగాయి. మా జీవితంలోనే అత్యంత సుదీర్ఘంగా గడిచిన 48 గంటలు అవి. నేను చెప్పేదంతా 500వ వికెట్, అంతకుముందు ప్రదర్శన గురించే. ఎంతో అసాధారణమైన వ్యక్తి అశ్విన్.. మీ పట్ల నేను చాలా గర్వపడుతున్నాను. మేము నిన్ను ఎంతో అభిమానిస్తున్నాము!'' అంటూ ప్రీతి నారాయణన్ భావోద్వేగపూరిత పోస్ట్ను పంచుకుంది.
రాజ్కోట్ టెస్ట్లో భారత్ 434 పరుగుల భారీ తేడాతో గెలిచి చరిత్ర సృష్టించింది. టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే పరుగుల పరంగా భారత్కు ఇది అతిపెద్ద విజయం. భారత్ విధించిన 557 పరుగుల లక్ష్య చేధనలో ఇంగ్లండ్ 122 పరుగులకే కుప్పకూలింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ జడేజా(5/41) ఐదు వికెట్లతో ఇంగ్లండ్ పతనాన్ని శాసించాడు.
తొలి ఇన్నింగ్స్లో 445 పరుగులు చేసిన భారత్.. రెండో ఇన్నింగ్స్లో 430/4 వద్ద డిక్లేర్ చేసింది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 319 పరుగులకు కుప్పకూలింది.