మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో విజేతగా నిలిచిన భారత జట్టుపై మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రశంసల జల్లు కురిపించాడు. భారత్ సాధించిన అన్ని ప్రపంచకప్ల కంటే ఈ విజయం ఎంతో గొప్పదని కొనియాడాడు. ముఖ్యంగా ప్రపంచకప్ టైటిల్ను మాజీ క్రికెటర్లు అయిన మిథాలీ రాజ్, జులాన్ గోస్వామికి అందించడాన్ని అశ్విన్ ప్రత్యేకంగా అభినందించాడు.
ఆదివారం నవీ ముంబై వేదికగా జరిగిన మహిళల వన్డే ప్రపంచకప్ ఫైనల్లో భారత్ 52 పరుగుల తేడాతో సౌతాఫ్రికాను ఓడించిన సంగతి తెలిసిందే. ఈ గెలుపుతో ఎన్నో దశాబ్దాల నిరీక్షణకు హర్మన్సేన తెరదించింది. 2005, 2017 ప్రపంచకప్ ఫైనల్లో ఆఖరి మెట్టుపై ఓడినా.. ఈ సారి ఎలాంటి తప్పిదం చేయకుండా తొలి టైటిల్ను ముద్దాడింది.

ప్రపంచకప్ అందుకున్న భారత మహిళా క్రికెటర్లు.. నేరుగా వెళ్లి మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్తో పాటు జులాన్ గోస్వామి, అంజుమ్ చోప్రాలకు అందించారు. మీ స్ఫూర్తితోనే ప్రపంచకప్ సాధించామని చెబుతూ సంబరాలు చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ కాగా.. నెటిజన్లు కూడా ఫిదా అయ్యారు. తాజాగా మహిళల ప్రపంచకప్ విజయంపై తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా మాట్లాడిన అశ్విన్ వారిపై ప్రశంసల జల్లు కురిపించాడు.
'భారత మహిళల జట్టు ప్రపంచకప్ను తీసుకెళ్లి మిథాలీ రాజ్ చేతిలో పెట్టింది. ఈ విషయంలో నేను హర్మన్ సేనను అభినందిస్తున్నా. భారత పురుషుల జట్టు ఇలా గతంలో ఎప్పుడూ చేయలేదు. కొన్నిసార్లు మీడియా ముందు మాత్రం ఏదో చెబుతుంటాం. ఆ వ్యక్తి అలా చేశాడు.. ఇలా చేశాడని గొప్పగా చెబుతాం. కానీ మాజీ ఆటగాళ్లకు క్రెడిట్ ఇవ్వడాన్ని నేను అయితే చూడలేదు. మా తరం బాగుంది. మీ తరం టీమ్ అంత గొప్పగా లేదనే చర్చలే ఎక్కువగా జరుగుతుంటాయి.
అంజుమ్ చోప్రా, మిథాలీ రాజ్కు టీమిండియా ట్రోఫీ అందించింది. దీంతో వారు కూడా భావోద్వేగానికి, అనందానికి లోనయ్యారు. అలా వారికి ట్రోఫీ ఇవ్వడం బాగుంది. భారత మహిళల జట్టుకు ఈ విజయం ఒక్క రోజులో వచ్చింది కాదు. ఇది 25 ఏళ్ల శ్రమకు ఫలితం. భారత మహిళల విజయం గతంలో సాధించిన ప్రపంచకప్ విజయాల కంటే గొప్పది. ఎందుకంటే ప్రస్తుతం మహిళల జట్టు విజయంతో ఎంతో మంది బాలికలు..క్రికెట్ను కెరీర్గా ఎంచుకోనున్నారు.'అని అశ్విన్ చెప్పుకొచ్చాడు.