
హైదరాబాద్: వెస్టిండిస్ పర్యటనలో ఉన్న టీమిండియా ప్రస్తుతం అక్కడి కరేబియన్ అందాలను ఆస్వాదిస్తోంది. రెండు టెస్టు మ్యాచ్ల సిరిస్లో భాగంగా ఆంటిగ్వా వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా 318 పరుగుల తేడాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
యుఎస్ ఓపెన్లో ఫెదరర్నే వణికించాడు: ఎవరీ సుమిత్ నగల్?
తొలి టెస్టు అనంతరం లభించిన విరామ సమయాన్ని భారత జట్టులోని ఆటగాళ్లు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు అతడి భార్య, బాలీవుడ్ నటి అనుష్క శర్మ... టీమిండియా ఆటగాళ్లు రవిచంద్రన్ అశ్విన్, మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్లు క్రూయిజ్లో సందడి చేశారు.
తొలి టెస్టు తుది జట్టులో చోటు దక్కించుకోవడంలో విఫలమైన టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ ఆశ్విన్ ఇందుకు సంబంధించిన ఫోటోని తన ఇనిస్టాగ్రామ్లో పోస్టు చేశాడు. ఈ ఫోటోలో కోహ్లీ, అనుష్క శర్మ, కేఎల్ రాహుల్, అశ్విన్, మయాంక్ అగర్వాల్లు విక్టరీ సింబల్ చూపిస్తూ ఫోజిచ్చారు.
మరోవైపు టెస్టు ఓపెనర్ కేఎల్ రాహుల్ సైతం తన ట్విట్టర్లో ఇదే ఫోటోని పోస్టు చేస్తూ "ఎండ్లెస్ బ్లూస్" అంటూ కామెంట్ పెట్టాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కాగా, తొలి టెస్టులో టీమిండియా 318 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. బ్యాటింగ్లో రహానే (102), హనుమ విహారి (93) రాణించడంతో పాటు బౌలింగ్లో ఫాస్ట్ బౌలర్లు బుమ్రా (5/7), ఇషాంత్ (3/31) విజృంభించడంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్లో టీమిండియా బోణీ చేసింది. 419 పరుగుల ఛేదనలో వెస్టిండీస్ 100 పరుగులకే ఆలౌట్ అయింది. కీమర్ రోచ్ (38; 31బంతుల్లో 1×4, 5×6) బ్యాట్ ఝళిపించడంతో విండీస్ ఆ మాత్రం పరుగులైనా చేసింది.