ఆసియా కప్ 2025 టోర్నీ తుది పోరుకు రంగం సిద్దమైంది. మరికొద్ది క్షణాల్లో ఈ మెగా టైటిల్ ఫైట్కు తెరలేవనుంది. 41 ఏళ్ల ఆసియా కప్ చరిత్రలోనే తొలిసారి భారత్, పాకిస్థాన్ జట్లు ఫైనల్లో తలపడుతున్నాయి. ఇప్పటికే ఈ టోర్నీలో పాకిస్థాన్ను రెండు సార్లు చిత్తు చేసిన టీమిండియా రెట్టించిన ఉత్సాహంతో ఉంది. మరోవైపు కనీసం ఫైనల్లో అయినా ఓడించి ప్రతీకారం తీర్చుకోవాలని దాయాదీ పాకిస్థాన్ భావిస్తోంది. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈ మ్యాచ్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
అయితే ఈ మ్యాచ్లో స్టార్ పేసర్ అర్ష్దీప్ సింగ్ను టీమిండియా కచ్చితంగా ఆడించాలని మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సూచించాడు. జస్ప్రీత్ బుమ్రా సరైన బౌలింగ్ జోడీ అతనేనని వెల్లడించాడు. శ్రీలంకతో అర్ష్దీప్ సింగ్ మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన చేశాడని గుర్తు చేశాడు. హార్దిక్ పాండ్యా దూరమైతే మరో ఆలోచన లేకుండా అర్ష్దీప్ సింగ్ను ఆడించాలన్నాడు. ఒకవేళ హార్దిక్ పాండ్యా ఉన్నా.. అర్ష్దీప్ సింగ్ను ఆడించాలని సూచించాడు. ఫైనల్ నేపథ్యంలో తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

'శ్రీలంకతో మ్యాచ్లో అర్ష్దీప్ సింగ్ బౌలింగ్ చేసిన విధానం అతను ఎంత కీలకమైన బౌలరో అనే విషయాన్ని స్పష్టం చేస్తోంది. మరోసారి అతను తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. కాబట్టి అర్ష్దీప్ సింగ్ను తుది జట్టులో ఆడించాలి. ఒకవేళ హార్దిక్ ఆడకపోతే.. అర్ష్దీప్ సింగ్కు అవకాశం ఇవ్వాలి. హార్దిక్ పాండ్యా భారత జట్టుకు కీలకమే. కానీ కొన్నిసార్లు అతని గైర్హాజరీ కూడా జట్టుకు మేలు చేస్తుంది. ఎందుకంటే అతని గైర్హాజరీ కారణంగా అర్ష్దీప్ సింగ్కు ఆడే అవకాశం దక్కుతుంది. అతను భారత్కు ఎంత విలువైన ఆటగాడిననే విషయాన్ని మరోసారి నిరూపించుకుంటాడు.
టీమిండియా నెంబర్ 8 బ్యాటర్ అవసరం లేదు. 8వ స్థానంలో వచ్చే బ్యాటర్ ఎన్ని పరుగులు చేయగలడు? ఒకవేళ బ్యాటింగ్ డెప్త్ కావాలంటే బ్యాటింగ్ కోచ్.. అర్ష్దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తీ, జస్ప్రీత్ బుమ్రాల బ్యాటింగ్పై ఫోకస్ పెట్టాలి. బుమ్రా ఇప్పటికే భారీ షాట్స్ ఆడగలడు. అతనికి మంచి బ్యాట్ స్వింగ్ కూడా ఉంది. టీ20 ప్రపంచకప్ 2025ను దృష్టిలో పెట్టుకొని అర్ష్దీప్ సింగ్ బ్యాటింగ్ సామర్థ్యాన్ని పెంచాలి.'అని అశ్విన్ సూచించాడు.
శ్రీలంకతో జరిగిన ఆఖరి సూపర్ 4 మ్యాచ్లో అర్ష్దీప్ సింగ్ 19వ ఓవర్తో పాటు సూపర్ ఓవర్లో అద్భుతంగా బౌలింగ్ చేసి భారత్ విజయంలో కీలక పాత్రపోషించాడు. నిలకడగా యార్కర్లు సంధించాడు. ఒకవేళ బుమ్రా, హార్దిక్ పాండ్యాతో పాటు అర్ష్దీప్ సింగ్ను ఆడించాలంటే శివమ్ దూబేను బెంచ్కు పరిమితం చేయాలి. కానీ గౌతమ్ గంభీర్ ఎలాంటి మార్పులు చేసే అవకాశం లేదు.