ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో టీమిండియా విజేతగా నిలిచింది. అద్దితీయమైన ప్రదర్శనతో ఓటమెరుగని జట్టుగా టైటిల్ను ముద్దాడింది. ఫైనల్లో న్యూజిలాండ్ను ఓడించి ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలోనే 3 టైటిళ్లు గెలిచిన జట్టుగా చరిత్ర సృష్టించింది. తుది పోరులో కెప్టెన్ ఇన్నింగ్స్తో ఆకట్టుకున్న రోహిత్ శర్మకు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'అవార్డు దక్కగా.. అత్యధిక పరుగులు చేసిన న్యూజిలాండ్ ప్లేయర్ రచిన్ రవీంద్రకు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డ్ దక్కింది.
అయితే ఈ రెండు అవార్డుల ఎంపికపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా శ్రేయస్ అయ్యర్ను ఎంపిక చేయాలని, ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డును వరుణ్ చక్రవర్తీకి ఇవ్వాల్సిందని అభిప్రాయపడుతున్నారు. టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సైతం వరుణ్ చక్రవర్తీకి ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డ్ ఇవ్వాల్సిందన్నాడు.

'నా దృష్టిలో ఛాంపియన్స్ ట్రోఫీ ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ వరుణ్ చక్రవర్తే. అతను టోర్నీ మొత్తం ఆడకపోయినా..ఆడిన మ్యాచ్ల్లో తీవ్ర ప్రభావం చూపాడు. వరుణ్ లేకపోతే టీమిండియా పరిస్థితి మరోలా ఉండేది. అతనో ఎక్స్ ఫ్యాక్టర్. ఫైనల్లో గ్లెన్ ఫిలిప్స్ ఔట్ చేసిన విధానం అద్భుతం. నేను జడ్జీనైతే ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు వరుణ్ చక్రవర్తీకే ఇచ్చేవాడిని. అందుకు అతను పూర్తి అర్హుడు.'అని అశ్విన్ తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా అభిప్రాయపడ్డాడు.
ఈ టోర్నీలో మూడు మ్యాచ్లు ఆడిన వరుణ్ చక్రవర్తీ 9 వికెట్లు పడగొట్టాడు. ఫైనల్లో రెండు కీలక వికెట్లు తీసాడు. అయితే ఫైనల్ మ్యాచ్లో వరుణ్ చక్రవర్తీని ముందుగా బౌలింగ్ తీసుకురావాడాన్ని తప్పుబడుతూ అశ్విన్ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశాడు. దాంతో తన ట్వీట్కు అశ్విన్ వివరణ ఇచ్చుకున్నాడు. 'నేను పెట్టిన ట్వీట్ రోహిత్ కెప్టెన్సీ గురించి భావించడం నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది. అభిమానుల మూర్ఖత్వం ఇది. వరుణ్ను ముందుగానే బౌలింగ్ అటాక్లోకి తేవాలని న్యూజిలాండ్ ఆటతీరు మనపై ఎలా ఒత్తిడి తెచ్చిందో చెప్పడానికే ఆ ట్వీట్ చేశాను'అని వివరణ ఇచ్చాడు.