ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో బరిలోకి దిగే టీమిండియా కాంబినేషన్పై మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఓపెనర్గా కెప్టెన్ రోహిత్ శర్మకు జతగా లెఫ్టార్మ్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ను ఆడించాలని సూచించాడు. ఇక స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని మూడో స్థానంలో కాకుండా నాలుగో స్థానంలో బ్యాటింగ్కు పంపించాలని అభిప్రాయపడ్డాడు.
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో బరిలోకి దిగే భారత జట్టును గత శనివారమే ప్రకటించిన విషయం తెలిసిందే. రోహిత్ శర్మ సారథ్యంలోని 15 మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలను చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కార్ వెల్లడించాడు. స్టార్ పేసర్ మహమ్మద్ షమీ రీఎంట్రీ ఇవ్వగా.. మహమ్మద్ సిరాజ్పై వేటు పడింది. యువ ఓపెనర్ శుభ్మన్ గిల్ను వైస్ కెప్టెన్గా ఎంపిక చేశారు. వికెట్ కీపర్లుగా రిషభ్ పంత్, కేఎల్ రాహుల్లకు అవకాశం దక్కింది.

ఓపెనర్గా యశస్వి..
ఈ టోర్నీలో బరిలోకి దిగాల్సిన టీమ్ కాంబినేషన్పై అశ్విన్ తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా చర్చించాడు. యశస్వి జైస్వాల్ ఎంపికకు గల కారణాన్ని కూడా వెల్లడించాడు. 'ఫామ్లో ఉన్న ఆటగాళ్లను వాడుకోవడం జట్టు బాధ్యత. యశస్వి జైస్వాల్ గత 18 నెలలుగా సూపర్ ఫామ్లో ఉన్నాడు. అంతేకాకుండా అతను లెఫ్టార్మ్ బ్యాటర్. జట్టుకు లెఫ్ట్ రైట్ కాంబినేషన్ ఇవ్వగలడు. అందుకే రోహిత్ శర్మకు జతగా యశస్వి జైస్వాల్నే ఓపెనర్గా ఆడించాలి.
అప్పుడే జట్టుకు సమతూకం వస్తుంది. లెఫ్ట్-రైట్ కాంబినేషన్తో ప్రత్యర్థి బౌలర్లు లైన్ అండ్ లెంగ్త్ అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇది బ్యాటర్లకు మరిన్ని పరుగులు చేసే అడ్వాంటేజ్ను ఇస్తోంది.

నాలుగో స్థానంలో కోహ్లీ..
శుభ్మన్ గిల్ను ఫస్ట్ డౌన్లో ఆడించాలి. విరాట్ కోహ్లీని నాలుగో స్థానంలో బ్యాటింగ్కు పంపించాలి. ఎందుకంటే కోహ్లీ నాలుగో స్థానంలో ఆడటం ద్వారా అటు జట్టుకు ఇటు అతని వ్యక్తిగత ప్రదర్శనకు ఉపయోగపడుతోంది. పరిస్థితులకు తగ్గట్లు ఆడటంలో కోహ్లీని మించినవారు లేరు. నాలుగో స్థానంలో బ్యాటింగ్కు వస్తే.. త్వరగా వికెట్లు పడితే యాంకర్ రోల్ పోషించగలడు.
మంచి ఆరంభం లభిస్తే దూకుడుగా ఆడి జట్టుకు కావాల్సిన పరుగులు అందించగలడు. ఐదో స్థానంలో వికెట్ కీపర్గా కేఎల్ రాహుల్ లేదా రిషభ్ పంత్ను బరిలోకి దించాలి. ఆరో స్థానంలో పేస్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాను ఆడించాలి. ఏడో స్థానంలో స్పిన్ ఆల్రౌండర్లు అయిన అక్షర్ పటేల్, జడేజా ఒకరికి అవకాశం ఇవ్వాలి.
సుందర్తో సమతూకం..
8వ స్థానంలో మాత్రం స్పిన్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ను ఆడించాలి. అతన్ని తీసుకోవడం ద్వారా జట్టు సమతూకం వస్తుంది. బ్యాటింగ్ డెప్త్తో పాటు బౌలింగ్ ఆప్షన్ ఉంటుంది. పేసర్లుగా అర్ష్దీప్ సింగ్, మహమ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రాలను ఆడించాలి. సిరాజ్పై వేటు వేయడం ఆశ్చర్యానికి గురి చేసింది. 'అని అశ్విన్ చెప్పుకొచ్చాడు.
అందుకే గిల్కు వైస్ కెప్టెన్సీ..
భవిష్యత్తు సారథిగా తీర్చిదిద్దేందుకే శుభ్మన్ గిల్కు వైస్ కెప్టెన్సీ ఇచ్చి ఉంటారని అశ్విన్ అభిప్రాయపడ్డాడు.'వైస్ కెప్టెన్గా శుభ్మన్ గిల్ను నియమించడం సరైందా కాదా? అని నేను చెప్పడం లేదు. కానీ గత సిరీస్లో అతను వైస్ కెప్టెన్గా ఉన్నాడు. టెస్ట్ల్లో కూడా కొన్ని మ్యాచ్లకు వైస్ కెప్టెన్గా వ్యవహరించాడు. ఇది తప్పు కూడా కావచ్చు. అయితే భవిష్యత్తు సారథిగా తీర్చిదిద్దేందుకే మేనేజ్మెంట్ అతన్ని వైస్ కెప్టెన్గా ఎంపిక చేసి ఉండవచ్చు.'అని అశ్విన్ తెలిపాడు.