సౌతాఫ్రికా చేతిలో టీమిండియా ఘోర పరాజయానికి హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఒక్కడినే బాధ్యుడిని చేయడం సరికాదని మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. ఆటలో గెలుపోటములు సహజమని, ఈ ఘోర పరాజయానికి ఆటగాళ్లు కూడా బాధ్యులేనని అభిప్రాయపడ్డాడు. సౌతాఫ్రికాతో రెండు టెస్ట్ల సిరీస్లో టీమిండియా 0-2తో క్లీన్ స్వీప్ అయిన సంగతి తెలిసిందే.
మరోవైపు సౌతాఫ్రికా 25 ఏళ్ల తర్వాత భారత గడ్డపై టెస్ట్ సిరీస్ గెలిచింది. వరుసగా రెండో ఏడాది కూడా టీమిండియా టెస్ట్ సిరీస్లో క్లీన్ స్వీప్ కావడంతో గంభీర్పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గంభీర్ను హెడ్ కోచ్ పదవి బాధ్యతల నుంచి తప్పించాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.

తాజాగా ఈ వ్యవహారంపై తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా స్పందించిన అశ్విన్.. గంభీర్కు అండగా నిలిచాడు. 'క్రికెట్ అనేది ఒక ఆట. గెలుపోటములు సహజం. జట్టును నడిపించడం అంత సులువు కాదు. ఈ ఘోర పరాజయానికి గంభీర్ కూడా బాధపడుతున్నాడు. మనం ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఈ ఓటమికి గంభీర్ ఒక్కరినే బాధ్యుడిని చేయడం సరికాదు. జట్టులో ప్రతీ ఒక్కరు ఈ ఓటమికి బాధ్యులే. భారత క్రికెట్ ఆర్థికంగా చాలా బలమైనది. అందుకే జట్టు ఓటమిపై తీవ్ర చర్చ జరుగుతుంది.
హెడ్ కోచ్ బ్యాట్ పట్టుకొని మైదానంలోకి దిగి ఆడలేడు కదా? ఆటగాళ్లు కూడా బాధ్యతాయుతంగా ఉండాలి. ఓటమికి ఒక్కరినే నిందించడం సరికాదు. కోచ్, కెప్టెన్ టీమ్ కాంబినేషన్పై నిర్ణయాలు తీసుకుంటారు. కానీ మన జట్టులోని ఆటగాళ్లలో ఒక్కరు కూడా బాధ్యతాయుతంగా ఆడినట్లు కనిపించడం లేదు. పిండి కొద్ది రొట్టె అంటారు. అసలు పిండే లేకుంటే రొట్టెలు ఎలా చేస్తారు? గంభీర్ను వెనకేసుకురావడానికి అతను ఏం నా చుట్టం కాదు. తప్పుడు జరగడం సహజం. అయితే ఇలాంటి ఘోర పరాజయాలు ఎదురైనప్పుడు జవాబుదారీతనంగా ఉండటం కీలకం. తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకొని సరిదిద్దుకోవాలి.'అని అశ్విన్ వివరించాడు.