టీమిండియా వన్డే వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్పై మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రశంసల జల్లు కురిపించాడు. టీమిండియాలోనే అయ్యర్ నిలకడైన ఆటగాడని కొనియాడాడు. న్యూజిలాండ్తో మూడు వన్డేల సిరీస్లో భాగంగా వడోదర వేదికగా జరిగిన తొలి మ్యాచ్తో అంతర్జాతీయ క్రికెట్లోకి రీఎంట్రీ ఇచ్చిన శ్రేయస్ అయ్యర్ 47 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్తో 49 పరుగులతో రాణించాడు. కైల్ జెమీసన్ అద్భుత బంతికి అయ్యర్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. గాయం తర్వాత ఆడిన తొలి మ్యాచ్లోనే అద్భుత ప్రదర్శన కనబర్చాడు. తాజాగా అయ్యర్ బ్యాటింగ్పై తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా మాట్లాడిన అశ్విన్..అతను ఔటైన తీరుపై ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.
'వన్డే క్రికెట్లో శ్రేయస్ అయ్యర్ భారత్కు అత్యంత నిలకడైన ఆటగాడని మనందరికి తెలుసు. అతను ఔటైన తీరు శ్రేయస్ శైలికి భిన్నంగా ఉంది. అతను ఎప్పుడూ అలా ఆట మధ్యలో ఔటవ్వడు. సాధారణంగా మ్యాచ్ను ముగించి వస్తాడు. అయితే అతను ఔటైన తీరును అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే అతను చాలా రోజుల తర్వాత జట్టులోకి వచ్చాడు. పైగా జెమీసన్ అద్భుతమైన బంతిని సంధించాడు.'అని అశ్విన్ చెప్పుకొచ్చాడు.

ఆస్ట్రేలియా పర్యటనలో ఫీల్డింగ్ చేస్తూ తీవ్రంగా గాయపడిన అయ్యర్ తృటిలో ప్రాణాపాయం నుంచి బయట పడిన సంగతి తెలిసిందే. క్యాచ్ అందుకునే క్రమంలో అదుపు తప్పి కిందపడటంతో అతని పక్కటెముకల కింది భాగంలోని ప్లీహానికి గాయమైంది. అంతర్గత రక్తస్రావం కావడంతో అయ్యర్ను ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. గాయం నుంచి పూర్తిగా కోలుకున్న అయ్యర్.. విజయ్ హజారే ట్రోఫీలో ఫిట్నెస్ నిరూపించుకొని న్యూజిలాండ్తో సిరీస్లో బరిలోకి దిగాడు.
విరాట్ కోహ్లీ ఆటలో ఎలాంటి మార్పు కనిపించలేదని, క్రికెట్ను ఆస్వాదిస్తున్నాడని అశ్విన్ తెలిపాడు. 'కోహ్లీ ప్రస్తుతం బ్యాటింగ్ గురించి తప్ప ఏ విషయమూ ఆలోచించడం లేదు. అతని ఆటలో ఎలాంటి మార్పు చేయలేదు. క్రికెట్ను ఆస్వాదిస్తున్నాడంతే. తన బాల్యంలో ఎలా క్రికెట్ ఆడాడో.. ఇప్పుడూ అదే తీరులో ఆడుతున్నాడు. దానికి అతని ఏళ్ల అనుభవం తోడైంది.'అని అశ్విన్ చెప్పుకొచ్చాడు. న్యూజిలాండ్తో తొలి వన్డేలో విరాట్ కోహ్లీ(93) తృటిలో సెంచరీ చేజార్చుకున్న సంగతి తెలిసిందే. వరుసగా ఐదు మ్యాచ్ల్లో కోహ్లీ 50 ప్లస్ స్కోర్లు నమోదు చేశాడు.