బంగ్లాదేశ్తో రెండో టెస్ట్లో టీమిండియా ఆడింది బజ్బాల్ గేమ్ కాదని, గమ్బాల్ అని వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. హెడ్ కోచ్ గౌతం గంభీర్ పేరు ప్రతిబింబించేలా భారత అటాకింగ్ గేమ్కు గమ్బాల్ అని పేరు పెట్టాడు. ప్రస్తుతం గమ్బాల్ అనే పదం నెట్టింట ట్రెండింగ్గా మారింది. కాన్పూర్ వేదికగా జరిగిన రెండో టెస్ట్లో టీమిండియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే.
ఫలితమే అసాధ్యమనుకున్న ఈ మ్యాచ్లో రోహిత్ సేన ధనాధన్ ఆటతో విజయాన్నందుకుంది. వర్షం కారణంగా ఈ మ్యాచ్లో రెండున్నర రోజుల ఆట తుడిచిపెట్టుకుపోయింది. అయినా భారత్ దూకుడుగా ఆడి ఫలితాన్ని రాబట్టింది.

టెస్ట్ క్రికెట్లో దూకుడుగా ఆడుతూ ఇంగ్లండ్.. ప్రపంచానికి బజ్బాల్ అనే పదాన్ని పరిచయం చేసింది. ఆ జట్టు హెడ్ కోచ్ బ్రెండన్ మెక్కల్లమ్ ముద్దు పేరు బజ్ నుంచి ఈ పదం వచ్చింది. అయితే బజ్బాల్కు అడ్వాన్స్డ్ వర్షెనా? అన్నట్టుగా బంగ్లాతో రెండో టెస్ట్లో భారత్ దూకుడుగా ఆడింది. దాంతో నెటిజన్లు ఈ అప్రోచ్కు గమ్బాల్ అని పేరు పెట్టారు.
సోషల్ మీడియాలో ఈ పదం ట్రెండింగ్లో నిలిచింది. విజయానంతరం అశ్విన్ కూడా తమ అటాకింగ్ గేమ్ బజ్బాల్ కాదని, గమ్బాల్ అని స్పష్టం చేయడంతో ఆ పదానికి మరింత ప్రాచుర్యం లభించింది. గమ్బాల్కు సంబంధించిన కొన్ని పోస్ట్లను చూశానని కూడా అశ్విన్ చెప్పుకొచ్చాడు.
95 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ రెండో ఇన్నింగ్స్లో 3 వికెట్లకు 98 పరుగులు చేసి గెలుపొందింది. కెప్టెన్ రోహిత్ శర్మ(8), శుభ్మన్ గిల్(6) విఫలమైనా.. యశస్వి జైస్వాల్(45 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్తో 51)హాఫ్ సెంచరీతో రాణించాడు. విన్నింగ్ షాట్ కోసం ప్రయత్నించి యశస్వి జైస్వాల్ ఔటవ్వగా.. రిషభ్ పంత్ సాయంతో విరాట్ కోహ్లీ(25 నాటౌట్) భారత విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్లో 233 పరుగులకు ఆలౌటైంది. మోమినుల్ హక్ (194 బంతుల్లో, 17 ఫోర్లు, 1 సిక్సర్తో 107 నాటౌట్) అజేయ శతకంతో సత్తాచాటాడు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా (3/50) మూడు వికెట్లు తీయగా... మహ్మద్ సిరాజ్, రవిచంద్రన్ అశ్విన్, ఆకాశ్ దీప్ రెండేసి వికెట్లు పడగొట్టారు. రవీంద్ర జడేజాకు ఒక వికెట్ దక్కింది.
అనంతరం భారత్.. తొలి ఇన్నింగ్స్ను 285/9 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. వ్యూహాత్మకంగా 34.4 ఓవర్లు మాత్రమే ఆడిన టీమిండియా.. బంగ్లాదేశ్పై 52 పరుగుల ఆధిక్యాన్ని అందుకుంది. బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్లో 146 పరుగులకే కుప్పకూలింది. అశ్విన్, జడేజా, జస్ప్రీత్ బుమ్రా మూడేసి వికెట్లు తీయగా.. ఆకాశ్ దీప్ ఒక వికెట్ పడగొట్టాడు.
బంగ్లాదేశ్ బ్యాటర్లలో ఓపెనర్ షెడ్మన్ ఇస్లామ్(101 బంతుల్లో 10 ఫోర్లతో 50) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించగా..ముష్ఫీకర్ రహీమ్(63 బంతుల్లో 37) భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు.