హైదరాబాద్: భారత బ్యాడ్మింటన్ స్టార్, ఒలింపిక్ విజేత పీవీ సింధు ఆంధ్రప్రదేశ్ క్రీడాశాఖ మంత్రి ఆర్కే రోజాను మర్యాదపూర్వకంగా కలిసారు. శనివారం హైదరాబాద్లోని నోవాటెల్ హోటల్లో మంత్రి రోజా కుటుంబ సభ్యులతో కలిసి పీవీ సింధు కుటుంబ సమేతంగా లంచ్ చేశారు. ఈ సందర్భంగా కామన్వెల్త్ గేమ్స్లో బంగారు పతకం సాధించిన సింధును రోజా ప్రత్యేకంగా అభినందించారు. సింధు సాధించిన విజయాన్ని యావత్ దేశం గర్వించిందని ప్రశంసించారు. భవిష్యత్తులో సింధు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందించిన సహకారానికి పీవీ సింధు కృతజ్ఞతలు తెలిపారు. లంచ్ అనంతరం ఇరు కుటుంబాల సభ్యులు కలిసి ఫొటోలు దిగారు.
బంగారు పతకం సాధించిన మన 'బంగారం' సింధు తన కుటుంబంతో వచ్చి నన్ను కలవడం చాలా ఆనందంగా ఉంది. నా కుటుంబంతో కలసి సింధు కుటుంబసభ్యులతో లంచ్ చేయడం జరిగింది. @Pvsindhu1 pic.twitter.com/xzfql3uyti
— Roja Selvamani (@RojaSelvamaniRK) August 20, 2022
ఈ ఫొటోలను రోజా ట్వీట్ చేసింది. 'బంగారు పతకం సాధించిన మన 'బంగారం' సింధు, తన కుటుంబంతో వచ్చి నన్ను కలవడం చాలా ఆనందంగా ఉంది. నా కుటుంబంతో కలిసి సింధు, తన కుటుంబసభ్యులతో లంచ్ చేసింది..'అంటూ పేర్కొంది. కామన్వెల్త్ గేమ్స్ 2022 వుమెన్స్ సింగిల్స్ ఫైనల్ మ్యాచ్లో కెనడా బ్యాడ్మింటన్ ప్లేయర్ మిచెల్ లీపై 21-15, 21-13 తేడాతో వరుస సెట్లలో ఘన విజయం అందుకుంది పీవీ సింధు. ఇంతకుముందు 2014 కామన్వెల్త్ గేమ్స్లో కాంస్యం, 2018 గోల్డ్ కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్ బ్యాడ్మింటన్ వుమెన్స్ సింగిల్స్ ఫైనల్లో ఓడి రజతం సాధించిన పీవీ సింధు, ఈసారి ఏకంగా స్వర్ణం సాధించి... 'ఇండియన్ గోల్డెన్ గర్ల్'గా కీర్తి ఘడించింది...
కామన్వెల్త్ గేమ్స్ 2022 టోర్నీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో అరికాలికి గాయం కావడంతో ఇబ్బంది పడిన పీవీ సింధు, అదే నొప్పితో సెమీ ఫైనల్, ఫైనల్ మ్యాచులు ఆడింది. గాయం ఇబ్బంది పెడుతుండడంతో బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ ఛాంపియన్షిప్స్కు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించింది.