ముంబై: అపెండిసైటిస్తో ఆస్పత్రిలో చేరిన పంజాబ్ కింగ్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్కు సోమవారం విజయవంతంగా సర్జరీ జరిగింది. తీవ్ర కడుపు నొప్పితో రాహుల్ ఆదివారం ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. ముందు అనుకున్నట్లు కోలుకోవడానికి అతడికి చాలా వారాలేమీ పట్టవని తెలుస్తోంది. వారం తర్వాత అతడు తన కార్యకలాపాలను పునరుద్ధరించవచ్చు.
రాహుల్ను తిరిగి బయో బబుల్లోకి అనుమతించడంపై ఐపీఎల్ అధికారులతో పంజాబ్ కింగ్స్ ఫ్రాంఛైజీ చర్చించనుంది. బబుల్లో అడుగుపెట్టడానికి ముందు రాహుల్ నిర్దేశిత హోటల్లో వారం రోజులు క్వారంటైన్లో ఉండాల్సి వుంటుంది. ఈ లెక్కన అతను మరో రెండు వారాల్లో జట్టుతో కలవనున్నాడు.
గత శనివారం రాత్రి తీవ్ర కడుపునొప్పితో బాధపడిన కేఎల్ రాహుల్ను టీమ్ ఫిజియో పరిశీలించగా.. అపెండిసైటిస్ అని తేలింది. దాంతో కేఎల్ రాహుల్కు సర్జరీ అనివార్యమవ్వడంతో అతన్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చేరడంతో అతను బయో బబుల్ వీడినట్లైంది. పైగా సర్జరీ కూడా అనివార్యం అవ్వడంతో అతను ఈ లీగ్కు దూరమైనట్లేనని అంతా భావించారు. కానీ అతను వారం రోజుల్లో కోలుకుంటాడని తెలుస్తోంది.
అలా జరిగి అతను బయో బబుల్ ప్రవేశించాలన్నా మరో వారం రోజు క్వారంటైన్లో ఉండాలి. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో పలు పరీక్షలు చేసిన తర్వాతే రాహుల్ జట్టుతో కలిసే అవకాశం ఉంది. రాహుల్ గైర్హాజరీలో జట్టును మయాంక్ అగర్వాల్ నడిపించగా.. ఢిల్లీ క్యాపిటల్స్తో ఆ టీమ్ చిత్తుగా ఓడింది. 7 మ్యాచ్ల్లో రాహుల్ 331 పరుగులు చేయగా.. ఇందులో నాలుగు హాఫ్ సెంచరీలున్నాయి.