ఐపీఎల్ 2021 వేదికలపై ముదురుతున్న వివాదం.. మొహాలిలో నిర్వహించాలని పంజాబ్ సీఎం రిక్వెస్ట్!

న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2021 సీజన్కు సంబంధించి భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయకపోయినా.. ఈ క్యాష్ రిచ్ లీగ్కు సంబంధించిన వేదికల వ్యవహారంపై దుమారం రేగుతోంది. కరోనా నేపథ్యంలో గత సీజన్ యూఏఈకి తరలిపోగా.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సీజన్ను భారత్లో నిర్వహించాలని బీసీసీఐ ప్రణాళికలు రచిస్తోంది. ఈ క్రమంలోనే ఐపీఎల్ 2021 సీజన్ కోసం బీసీసీఐ 6 వేదికలను షార్ట్ లిస్ట్ చేసిందని గత రెండు రోజులుగా ప్రచారం జరుగుతుంది. చెన్నై, బెంగళూరు, కోల్కతా, ఢిల్లీ, అహ్మదాబాద్, ముంబై వేదికల్ని ప్రాథమికంగా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

ఫ్రాంచైజీల అసంతృప్తి
అయితే ఈ వేదికలపై సన్రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీలు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నాయి. సొంత మైదానంలో ఎక్కువ మ్యాచ్లు గెలిచిన జట్లే ప్లేఆఫ్కు వెళ్తుండగా, బీసీసీఐ నిర్ణయం తమ జట్లకు ప్రతికూలం అవుతుందని పేర్కొన్నాయి. కరోనా కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని.. గతేడాది యూఏఈలో టోర్నీ నిర్వహించిన విషయాన్ని బీసీసీఐ గుర్తు చేస్తోంది. యూఏఈ తటస్థ వేదిక కాబట్టి అన్ని జట్లకూ మైదానాలు సమానమేనని ఇక్కడ మాత్రం పరిస్థితి వేరని ఫ్రాంఛైజీలు బీసీసీఐని తప్పుబడుతున్నాయి. వ్యాపారపరంగానూ నష్టం వస్తుందని చెబుతున్నాయి. బీసీసీఐ తన నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలని టీమ్ యాజమాన్యాలు విజ్ఞప్తి చేస్తున్నాయి.

రాజకీయంగానూ కదలికలు..
ఏ జట్టూ లేని అహ్మదాబాద్కు అవకాశం కల్పించి హైదరాబాద్, రాజస్థాన్, పంజాబ్లో మ్యాచ్లకు అవకాశం ఇవ్వకపోవడంపై రాజకీయంగానూ స్పందనలు వస్తున్నాయి. హైదరాబాద్లో మ్యాచ్ల నిర్వహణకు తెలంగాణ సర్కార్ నుంచి పూర్తి సహకారం ఉంటుందని తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ మేరకు బీసీసీఐకి ట్వీట్ చేసిన కేటీఆర్.. తమ నిర్ణయం మార్చుకోవాలని కోరారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అజారుద్దీన్ కూడా కేటీఆర్కు మద్దతు పలికారు. హైదరాబాద్లో ఐపీఎల్ నిర్వహించాలని సూచించారు.
పంజాబ్ సీఎం సైతం..
తాజాగా పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ సైతం ఐపీఎల్ వేదికల వ్యవహారంపై స్పందించారు. ఐపీఎల్ 2021 ఎడిషన్ వేదికల్లో మొహాలీ లేకపోవడం చూసి తాను ఆశ్చర్యానికి గురయ్యాయని అమరీందర్ సింగ్ ట్వీట్ చేశారు. ఐపీఎల్ నిర్వహణకు తమ ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని.. మొహలీలో మ్యాచ్లు నిర్వహించాలని బీసీసీఐకి విజ్ఞప్తి చేశారు. మరోవైపు ఇదే విషయంపై పంజాబ్ కింగ్స్ సహ యజమాని నెస్ వాడియా బీసీసీఐకి లేఖ రాశారు. మొహలీలో కరోనా కేసులు తక్కువ ఉన్నప్పటికీ ప్రస్తుత సీజన్ను నిర్వహించేందుకు ఈ వేదికను ఎందుకు ఎంపిక చేయలేదని ప్రశ్నించారు. మొహలీలో మ్యాచ్లు నిర్వహించకపోవడంపై తమతో పాటు ఫ్రాంఛైజీ అభిమానులు ఎంతో నిరాశ చెందారని నెస్ వాడియా అన్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications