
న్యూఢిల్లీ: కన్నడ పవర్స్టార్ పునీత్ రాజ్కుమార్ (46) తుదిశ్వాస విడిచారు. శుక్రవారం ఉదయం ఇంట్లో జిమ్ చేస్తుండగా గుండెపోటుతో కుప్పకూలిన ఆయన్ని కుటుంబసభ్యులు హుటా హుటీన సమీప విక్రమ్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ మేరకు విక్రమ్ ఆస్పత్రి వైద్యులు తాజాగా హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. పునీత్ మరణంతో కన్నడ సినీ పరిశ్రమలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయన అకాల మరణం పట్ల అభిమానులు, సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.
పునీత్ మరణం కన్నడ చిత్రపరిశ్రమకు తీవ్రలోటని సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలంటూ పోస్టులు పెడుతున్నారు. భారత క్రికెట్ దిగ్గజాలు అనిల్ కుంబ్లే, వీరేంద్ర సెహ్వాగ్ సైతం పునీత్ ఆత్మకు శాంతి చేకూరాలని ట్వీట్ చేశారు.
'పునీత్ రాజ్కుమార్ మరణ వార్త చాలా బాధకు గురిచేసింది. ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన రాజ్కుమార్ అకాల మరణం భారతీయ సినిమాకు తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నా. ఓ శాంతి'అని వీరేంద్ర సెహ్వాగ్ ట్వీట్ చేశాడు. 'పునీత్ రాజ్కుమార్ అకాల మరణం దిగ్భ్రాంతికి గురి చేసింది. కన్నడ చిత్ర పరిశ్రమ ఓ రత్నాన్ని కోల్పోయింది. నేను కలిసిన అత్యుత్తమ వ్యక్తుల్లో పునీత్ రాజ్కుమార్ ఒకరు. ఆయన కుటుంబ సభ్యులకు స్నేహితులకు, అసంఖ్యాక అభిమానులకు నా సంఘీభావాన్ని తెలియజేస్తున్నా'అని కుంబ్లే ట్వీట్ చేశాడు.
మరోవైపు కర్ణాటక రాష్ట్రవ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించారు. ఆస్పత్రి ఆవరణతోపాటు ప్రధాన మార్గాల్లో పోలీసు బందోబస్తు పెంచారు. రెండు రోజులపాటు సినిమా థియేటర్లు మూసివేయాలని కర్ణాటక ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కన్నడ కంఠీరవ రాజ్కుమార్ మూడో కుమారుడు పునీత్ రాజ్కుమార్. బాలనటుడిగా వెండితెరకు పరిచయమైన పునీత్.. అనతి కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 'బెట్టడా హువు' చిత్రానికి గానూ ఉత్తమ బాలనటుడిగా అవార్డు సొంతం చేసుకున్నారు.
హీరోగా ఇప్పటివరకూ ఆయన 32 చిత్రాల్లో నటించారు. 'వసంత గీత', 'భాగ్యవంత', 'ఏడు నక్షత్రాలు', 'భక్త ప్రహ్లాద', 'యరివాను' వంటి చిత్రాలు ఆయనకు హీరోగా మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఇటీవల ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం 'యువరత్న' మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇటు తెలుగు ప్రేక్షకులకు కూడా పునీత్ సుపరిచితమే. ఆయన నటించిన పలు చిత్రాలు తెలుగులోనూ డబ్ అయ్యాయి.