న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు కిట్ స్పాన్సర్షిప్ రేసులో జర్మనీకి చెందిన ప్రముఖ ఫుట్వేర్ కంపెనీ పూమా నిలిచింది. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. బిడ్లో పాల్గొనేందుకు అవసరమైన ఇన్విటేషన్ టు టెండర్ (ఐటీటీ) పత్రాన్ని పూమా సంస్థ ప్రతినిధులు కొనుగోలు చేసినట్లు ఆయన వెల్లడించారు. పూమాతో పాటు జర్మనీకే చెందిన మరో సంస్థ అడిడాస్ కూడా టీమిండియా కిట్ స్పాన్సర్షిప్ను దక్కించుకొనేందుకు సుముఖంగా ఉన్నట్లు సమాచారం.
ఇక భారత జట్టు కిట్ స్పాన్సర్గా 14 ఏళ్ల పాటు కొనసాగుతూ వస్తోన్న నైకీ కాంట్రాక్టు వచ్చే నెలతో ముగియనుంది. రూ.370 కోట్ల డీల్ ప్లస్ 30 కోట్ల రాయల్టీతో 2016 నుంచి 2020 వరకూ కిట్ స్పాన్సర్గా ఉన్న ఈ కంపెనీ మరోసారి బిడ్ వేస్తుందా? లేదా? అనే దానిపై క్లారిటీ లేదు. కరోనా కారణంగా ఎకానమీ దెబ్బతిన్న నేపథ్యంలో నైకీ ఇచ్చిన దానితో పోలిస్తే ఈసారి కిట్ స్పాన్సర్షిప్ తక్కువ మొత్తానికే అమ్ముడయ్యే అవకాశం ఉంది. వచ్చే ఐదేళ్ల రైట్స్ కోసం కొత్త స్పాన్సర్ రూ.200 కోట్లు మాత్రమే చెల్లించినా ఆశ్చర్యపోనక్కర్లేదని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
కరోనా నేపథ్యంలో స్పాన్సర్షిప్ మొత్తాన్ని తగ్గించాలన్న నైకీ విజ్ఞప్తిని బీసీసీఐ తోసిపుచ్చడంతో ఆ సంస్థ కాంట్రాక్ట్ రెన్యువల్ చేసుకోలేదు. కానీ రూల్ ప్రకారం మళ్లీ టెండర్ వేసే హక్కు దానికి ఉంది. కరోనా నేపథ్యంలో బిడ్డింగ్ కనీస ధరను బీసీసీఐ భారీగా తగ్గించింది. గతంలో మ్యాచ్కు రూ. 88 లక్షలుగా ఉండగా... ప్రస్తుతం అది రూ. 61 లక్షలకు తగ్గింది.